తిరుసభ మొదటినుండి ఈ మంత్రాన్ని జపిస్తూ వచ్చింది. "18 ఆశీర్వాదాలు" అనే ప్రార్థనను యూదులు ప్రతిరోజు మూడుసార్లు జపించేవాళ్ళ తొలినాటి క్రైస్తవులు ఈ యూద ప్రార్థనకు బదులుగా పరలోక జపాన్ని రోజుకి మూడుసార్లు జపించారు. దైవార్చన ప్రార్ధనలో ఈ జపం వస్తుంది. జ్ఞానస్నానం దివ్యసత్పసాదం అనే ప్రారంభ సంస్కారాల్లో ఈ ప్రార్థన వస్తుంది. తొలినాటి క్రైస్తవ బోధకులు క్రొత్తగా క్రైస్తవ సమాజంలో చేరేవాళ్ళకు ఈ జపాన్ని నేర్పించి వాళ్ళచే దీన్ని చెప్పించారు.
పూజలో దివ్యసత్ర్పసాదానికి ముందు ఈ జపం వస్తుంది. అంతవరకు మనం పూజలో చేసిన మనవులన్నీ దీనిలో పునరావృతమౌతాయి. కాని పూజలో ఈ జపం క్రీస్తు రెండవ రాకడను జ్ఞప్తికి తెస్తుంది. ప్రభువు మళ్ళా తిరిగి వచ్చిందాకా మనం అతని ఆగమనంకోసం ఎదురు చూస్తుంటాం.
సాహసిస్తున్నాం
పూజలో పరలోక జపం చెప్పడానికి ముందు "మనరక్షకుడు ఇచ్చిన పరమోపదేశాన్ని అనుసరించి ప్రార్ధింప సాహసింతము' అంటాం. దేవుణ్ణి పేరెత్తి పిలవడానికీ, తండ్రీ అని సంబోధించడానికీ మనం నిజంగా సాహసించాలి, పూర్వం మోషే మండుతూన్న పొదను సమీపింపగా "దగ్గరికి రావద్దు చెప్పలు విడువు. నీవు నిలుచున్న చోటు పవిత్రభూమి సుమా!" అని దివ్యవాణి విన్పించింది - నిర్గ 3-14. నరుడు దేవుని చెంతకు రాలేడు అని ఈ సంఘటనం భావం. దేవుని సన్నిధిలోనికి ప్రవేశింప గలిగినవాడు క్రీస్తు వొక్కడే పాపపు నరులమైన మనకు ఆ భాగ్యంలేదు. బానిసలమైన మనం ఈ మట్టిలో కలసిపోవలసిందే. కాని తండ్రీ, అతని కుమారుని ఆత్మా మనం దేవుణ్ణి అబ్బా – నాన్నా అని పిల్చేలా చేస్తారు, దేవుడు అనుగ్రహించందే నరుడు దేవుణ్ణి తండ్రి అని పిలువలేడు కదా!
దేవుని ఆత్మే మనకు పరలోక జపాన్ని చెప్పకొనే ధైర్యాన్ని దయచేస్తుంది. మనం దేవుని బిడ్డలం, దేవుడు మన మొర వింటాడు, మనం అతన్ని నమ్మవచ్చు, సరళ స్వభావంతో వినయంతో అతన్ని సమీపించవచ్చు- ఈ మొదలైన భావాలన్నీ పై “ధైర్యం" అన్నమాటలో ఇమిడి వున్నాయి.
తండ్రీ
దేవుణ్ణి తండ్రీ అని పిలుస్తున్నాం. కాని ఆ తండ్రి మన భూలోకంలో తండ్రుల్లాంటివాడూ తల్లల్లాంటివాడూ కాడు. కుమారుడు తప్ప మరెవ్వరు తండ్రిని