5. ఆరాధన ప్రార్ధనం
39. యావే పరిశుద్దుడు, పరిశుద్దుడు, పరిశుద్దుడు -యెష 6,3
యెషయా ప్రవక్త యువకుడుగా వున్నప్పడు ఓమారు ప్రభువును ఆరాధించుకోవడం కోసం యెరూషలేం దేవాలయానికి వెళ్ళాడు. దేవాలయంలో అతనికి ఓ దర్శనం లభించింది. ఆ దర్శనంలో, ప్రభువు రాజఠీవితో ఉన్నత సింహాచనంపై ఆసీనుడై వుండగా చూచాడు. ప్రభువునకు పైగా దేవదూతలు బారులతీరి వున్నారు. ఆ దేవదూతలు ప్రభు సాన్నిధ్యంలో వున్నారు కనుక భయభక్తులతో రెక్కలు విప్పి ముఖాలు కప్పకుంటున్నారు. "సైన్యములకు అధిపతియైన యావే పరిశుద్దుడు, పరిశుధుడు, పరిశుద్ధుడు. సర్వలోకం ఆయన మహిమతో నిండివుంది" అని యెలుగెత్తి గాన ప్రతిగానలు చేస్తున్నారు.
ఈ దర్శనంలో దేవదూతలు ప్రభువును స్తుతించి ఆరాధిస్తున్నారు అన్నాం. మనం దేవుని చెంత నుండి పొందిన ఉపకారాలను తలంచుకొని అతన్నిస్తుతించినటైతే అది కృతజ్ఞతా ప్రార్ధనమౌతుంది. ఆలాకాకుండ ప్రభువు, మహిమ, పరిశుద్ధత్వం మొదలైన దైవలక్షణాలను స్మరించుకొని దేవుణ్ణి అతని కోసమే అతన్నిస్తుతించినటైతే అది ఆరాధన ప్రార్ధనమౌతుంది. ఈలాంటి ఆరాధన జపానికి మనం అలవాటు పడుతుండాలి.
40. తలవంచి యావేకు మొక్కితిని - ఆది 24, 48.
అబ్రాహామునకు వృద్ధసేవకు డొకడుండేవాడు. అతడు అబ్రాహాము యాజ్ఞపై ఈసాకునకు పిల్లను వెదకగోరి, వారి సొంతదేశమైన పదనారామునకు ఒంటెలతో ప్రయాణమై వెళ్తాడు. అలావెళూ "ఏ బాలిక నాకు ఈ వొంటెలకూ నీళ్ళు తోడియిస్తుందో ఆమెయే ప్రభుకృపవల్ల మా ఈసాకునకు వధువు కావాలి" అని ముందుగానే ప్రార్ధనం చేసికున్నాడు. ఆ ప్రార్ధనం ముగిసిందోలేదో కడవ భుజంమీద పెట్టుకొని రిబ్కా వచ్చింది. ఆబాలిక అతనికీ, ఒంటెలకూ నీళ్ళు తోడియిచ్చింది. అబ్రాహాము సేవకునకు ప్రభుచిత్తం అర్థమైంది. అతడు వెంటనే తలవంచి యావేకు మొక్కాడు. యజమానుని దేవుడైన ప్రభువునకు స్తోత్రాలు చెల్లించాడు. ఆరాధనం అంటే యిలా వుంటుంది. ఆరాధనాపరుడు ఆయా వ్యక్తుల్లోను ఆయూ సన్నివేశాల్లోను భగవంతుని దర్శిస్తాడు. దర్శించి భగవత్సాన్నిధ్యానికి మొక్కులిడుతూంటాడు.