ఇంతవరకు విజ్ఞాపన ప్రార్థననుగూర్చి పూర్వవేదంలోని ఉదాహరణలనుచూచాం. ఇక నూత్న వేదంలోని ఉదాహరణలనుగూడ కొన్నింటిని చూద్దాం.
13. నేను నీకొరకు వేడుకొంటిని - లూకా 22, 31-32
పేతురు ప్రభువును ప్రేమించాడు. కాని ప్రభువే మెస్సీయా అన్న విషయంలో మాత్రం అతని విశ్వాసం ఇంకా బలపడలేదు. అందుకే అతడు ప్రభువును ఎరుగనని మూడు సారులు బొంకాడు. పిశాచం అతన్ని జల్లెడలోని గోదుమల్లాగ జల్లించాలని కోరుకుంది. అనగా అతన్ని పట్టుకొని బలంగా ఊపివేయాలి అని, అంటే అతన్ని తీవ్రంగా శోధించాలి అని కోరుకుంది. ప్రభువు మాత్రం పేతురు కోసం ప్రార్థించాడు. కనుకనే అతని విశ్వాసం వేరంట నాశనమై పోకుండ నిలచింది. అతడు క్రీస్తుని ఎరుగనని బొంకినపిదపగూడ మళ్ళా పశ్చాత్తాప పడ్డాడంటే, అది ప్రభు ప్రార్ధనా ఫలితమే. ఈవిధంగా ప్రభువుపేత్రు తరపున చేసిన విజ్ఞానం ఆపదల్లోనుండి అతన్నికాపాడింది. మన విజ్ఞాపన ప్రార్థనలూ చాలమందిని శోధనలనుండి కాపాడుతూంటాయి.
14. తండ్రీ, వీరిని క్షమింపుము - లూకా 23, 34
మిత్రులకోసం మాత్రమేగాక శత్రువులకోసంగూడ ప్రార్థించాడు ప్రభువు. ప్రభువును ఇద్దరు దొంగలమధ్య సిలువమీద కొట్టి చంపారు శత్రువులు. ఐనా క్రీస్తు వాళ్లను దూషింపలేదు గదా, వాళ్లకోసం విజ్ఞాపనం జేసాడు. వాళ్లపాపం వాళ్లకే అర్థం కావడం లేదుగనుక వాళ్లను క్షమించమని వాళ్ల తరఫున తండ్రిని మనవి చేసాడు. మరో సందర్భంలో, శత్రువులనుగూడ ప్రేమించమన్నాడు ప్రభువు. హింసించే వాళ్లకొరకు ప్రార్ధనం చేయమన్నాడు. - మత్త 5,44. శత్రువులను ప్రేమించి వాళ్లకు ఉపకారంచేసే మార్గాల్లో ప్రార్థనామార్గం శ్రేష్టమైంది. విజ్ఞాపన ప్రార్ధనల ద్వారా శత్రువుల మనసు మారుస్తాం. వాళ్ళనుగూడ ప్రభువు వైపు ఆకర్షిస్తాం. సైఫను ప్రార్ధనల వల్లనే సౌలు మనసు మార్చుకొని పౌలుగా తయారయ్యాడు. ఇక, మనం స్వీయదోషం వల్ల యెవరెవరితో కలహిస్తూంటామో వాళ్ళందరికోసమూ ప్రభువునకు విజ్ఞాపనం చేస్తూవుండాలి.
15. సంఘమయితే పేత్రుకోసం దేవుని ప్రార్ధించింది - ఆ.చ. 12,5
హెరోదు తొలినాటి క్రైస్తవ సమాజాన్ని హింసించడం మొదలెట్టాడు. యోహాను సోదరుడైన 'యాకోబును ఖడ్గంతో చంపించాడు. అది చూచి యూదులు భళీ అని మెచ్చుకున్నారు. దానితో హెరోదు ఉప్పొంగిపోయి, పేత్రుని గూడ బంధించి చెరలో వేయించాడు. పాస్క పండుగ ముగిసిన పిమ్మట అతన్ని కూడ చంపించాలని