6. ప్రాణి పోషణం
యిస్రాయేలు దేవుడు సృష్టికర్త మాత్రమేగాదు, ప్రాణి పోషకుడు గూడ. ఆయన ఆకాశం నుండి భూమివైపు పారజూస్తూంటాడు. నరుల నందరినీ గమనిస్తుంటాడు, పూర్వం ప్రభువు మోషే అహరోనులనే నాయకుల ద్వారా తన ప్రజలను నడిపించాడు. ఆయన మబ్బులను లేపి వానలు కురిపిస్తూంటాడు. వన్యమృగాలనూ, కాకి పిల్లలనూ పోషిస్తూంటాడు. ప్రభువ సృజించిన నదులు పొలాలలో పంటను పండిస్తాయి. లోయలలో గోదుమ పంట ఎదుగుతుంది. పొలాల నిండా పశుజాలం మందలు మందలుగా తిరుగాడుతుంది. చెలమల్లో నుండి పారే నీళ్ళు త్రాగి అడవి గాడిదలు దప్పిక తీర్చుకొంటాయి. నీటి యొడ్డున ఎదిగే చెట్ల కొమ్మల్లో పక్షులు గూళ్ళ కట్టుకొని హాయిగా పాడుతుంటాయి. ప్రాణులన్నీ ఆకలై ప్రభువు వైపు చూస్తాయి. ఆయన చేయిచాచి ఆహారం పెడితే కడుపార తింటాయి. పెట్టకపోతే సొమ్మసిల్లిపోతాయి. ఆయన ప్రాణంతీస్తే చస్తాయి. ప్రాణం పోస్తే బ్రతుకుతాయి. ఈ విధంగా భూమి మీద ప్రాణులు పడుతూంటాయి, గిడుతుంటాయి. ప్రభువు మాత్రం నిత్యం ప్రాణిపోషకుడుగా వ్యవహరిస్తుంటాడు. ఈ భూమి ప్రభువు చేసిన ప్రాణులతో నిండివుంది, అడవి మేకలనూ, కుందేళ్ళనూ, సింగప కొదమలనూ పోషించేది అతడే. ఆ ప్రభువు ప్రేమతో, కరుణతో ప్రాణికోటి నంతటినీ తనయందు భరించుకొంటూంటాడు.
1. ప్రభువు ఆకాశము నుండి
భూమిమీదకి పారజూస్తుంటాడు
నరుల నందరినీ గమనిస్తుంటాడు
సింహాసనం మీద కూర్చుండి రాజ్యం చేసే ప్రభువు
భూమి మీద సంచరించే నరులందరినీ గుర్తిస్తుంటాడు
నరుల ఆలోచన లన్నిటినీ పరిశీలిస్తుంటాడు
వాళ్ళు చేసే పనులన్నీ పరీక్షిస్తుంటాడు - కీర్త 33,13-15
2. మోషే ఆరోహనులనే కాపరుల ద్వారా
నీ ప్రజలను ఓ మందలా నడిపించావు - కీర్త 77,20
3. అతడు ఆకాశంలో మబ్బలు ఆవరించేలా చేస్తుంటాడు
నేలమీద వానలు కురిపిస్తుంటాడు
కొండలమీద పచ్చిక మొలిపిస్తుంటాడు