ప్రభువు పాపాత్ములైన ప్రజలను నాశంజేసినా భక్తులైన శేషజనాన్ని కొందరిని మిగులనిస్తాడు. వీళ్ళద్వారా తన రక్షణ ప్రణాళికను భూమిమీద కొనసాగించుకొనిపోతాడు. నోవా ఈ శేషజనానికి గుర్తుగా వుంటాడు. పూర్వవేదం అంత్యకాలంలో వర్ధిల్లిన సీరా నోవాను ఈలా కీర్తించాడు.
నోవా పరిపూర్ణ భక్తుడు
అతని వలన జలప్రళయానంతరం
నూత్న నరజాతి ఉద్భవించింది
అతనివల్లనే జలప్రళయయం ముగిసాక
భూమిమీద నరజాతి శేషం మిగిలింది - 44, 17.
నోవా, అతడు సూచించే శేషజనం భవిష్యత్తులో రానున్న మెస్సియాను సూచిస్తారు. ఈ మెస్సియా శేషజనానికంతటికీ ప్రతినిధి.
నోవా లోకాన్ని రక్షించినట్లుగా భక్తిమంతులు తమ కాలపు జనులను రక్షిస్తారు. పూర్వం జలప్రళయ కాలంలో లోకం ఆశలన్నీ నోవా పడవమీదనే నిల్చాయి. దేవుడు ఆ పడవను మునగకుండా కాపాడాడు. తర్వాత ఆ పడవలోనివాళ్ళు నూత్న నరజాతి పట్టుకకు కారకులయ్యారు. ఆదాము ప్రాతతరం నరులకు తండ్రి. నోవా నూత్నతరం నరులకు తండ్రి - సోలోమోనుజ్ఞానం 14,6.
ప్రార్థనా భావాలు
1. క్రీస్తు తన బోధల్లో నోవాను ఆదర్శ భక్తునిగా పేర్కొన్నాడు. జలప్రళయ కాలంలో పాపపు నరులు దేవుణ్ణి మర్చిపోయారు. తింటూ త్రాగుతూ పెండ్లి చేసికొంటూ సుఖాలు అనుభవించారు. వాళ్లు జాగరూకులుగా వుండలేదు. రానున్నదేవుని శిక్షను పసికట్టలేదు. కనుక ఆ శిక్షలో జిక్కి నాశమయ్యారు. కాని నోవా ఈలా ప్రవర్తించలేదు. అతడు అప్రమత్తుడై వున్నాడు. ప్రభువు శిక్ష త్వరలోనే వస్తుందని గుర్తించాడు. భక్తితో జీవించి ఆ శిక్షను తప్పించుకొన్నాడు. కనుక దేవుని రాకడ కొరకు భక్తితో వేచివుండేవాళ్ళందరికీ నోవా ఆదర్శంగా వుంటాడు - మత్త 24, 37-38.
2. ప్రభువు నరుల పాపాలకు జలప్రళయం వస్తుందని ముందుగానే హెచ్చరించాడు. కాని ఆనాటి నరులెవ్వరూ అతని హెచ్చరికలను లెక్కచేయలేదు. వాళ్ల