ఎల్లాదు, మేదాదు అనే యిద్దరుకూడ పై 70 మందిలోనివాళ్లే, వాళ్ళ గుడారానికి రాక ఇంటివద్దనే వున్నా ప్రవచనం చెప్పారు. వారి ప్రవచన శక్తికి అసూయపడి వారి నోళ్ళు మూయించమని యోషువా మోషేతో చెప్పాడు. కాని మోషే యిస్రాయేలు సమాజమంతా ప్రవక్తలై దేవుణ్ణిస్తుతిస్తే బాగుంటుంది అన్నాడు. అనగా అతడు అసూయ, స్వార్థంలేని మహానాయకుడు. తర్వాత ఈ యిద్దరుకూడ మోషేతో కలసి సమాజానికి పెద్దలుగా వ్యవహరించారు.
3. మిర్యాము అహరోనుల అసూయ 12, 1-16
ఈ సంఘటనం కుటుంబంలోని అంతః కలహాలవల్ల పుట్టింది. మోషే అన్యజాతి స్త్రీని పెండ్లాడాడు. దీన్ని కారణంగా దీసికొని అహరోను మిర్యాము ఏకమై మోషేమీద పోట్లాడారు. వాళ్ళు నీ వొక్కడివే నాయకుడివా? ప్రభువు మాద్వారా గూడ మాట్లాడలేదా అన్నారు. అనగా మోషేతో పాటు మేముకూడ యిస్రాయేలు సమాజానికి నాయకులమని వాళ్ళ భావం. అతని ఏకైక నాయకత్వాన్ని అన్నా అక్కా సవాలు చేసారు. నరులందరిలోను మోషే మహా వినయవంతుడు — 3. అనగా అతడు దేవునికి సన్నిహితుడు, ప్రీతిపాత్రుడు. అక్క తగాదా ఆడినా మోషే తగాదాకు దిగలేదు.
దేవుడే అతని కోపు తీసికొన్నాడు. ప్రభువు అహరోను మిర్యామలను చీవాట్లపెట్టాడు. నేను ఇతర ప్రవక్తలతో కలలద్వారా పరోక్షంగా మాటలాడతాను. కాని మోషేతో నేరుగా మాటలాడతాను. అతడు నా యాకారాన్ని చూచాడు. ఆలాంటివాణ్ణి మీరు ఎదిరిస్తారా అని మందలించాడు. ప్రభువు మందలింపు ద్వారా మోషే ఏకైక నాయకుడని రుజువైంది.
దేవుడు మిర్యాముకు శిక్షగా కుష్టరోగాన్ని కలిగించాడు. ఆమె గర్భంలోనే చనిపోయి పుట్టిన పిండంలాగ వికారంగా వుంది. అహరోను దేవునికి మొరపెట్టి ఆమె కుష్టను తొలగించమని తమ్ముణ్ణి వేడుకొన్నాడు. ఆలాగే మోషే అక్కకొరకు ప్రార్థన చేసాడు. మిర్యాము కుష్టపోయింది. ఆమెను ఏడునాళ్ళ శిబిరం నుండి తొలగించి మళ్ళా శిబిరంలో చేర్చుకొన్నారు. ఈ గ్రంథమంతటా మోషే ప్రజల తరపున విజ్ఞాపనం చేసేవాడుగా కన్పిస్తాడు.
ఇది ఐదంశాలతో గూడిన తిరుగుబాటు కథ. నేడు మనంకూడ భక్తిభావంతో చదువుకొని మననం చేసికోదగ్గది. నాయకుల అధికారాన్నీ పెద్దరికాన్నీ చూచి అసూయ