ఈ పుట అచ్చుదిద్దబడ్డది

'బాపిరాజు'

వీరి రాక గాని పోక గాని యీ అనంత విశ్వానికి అవసరమున్నదా అని జగ్గన్న అనుకొన్నాడు. కీర్తి ప్రతిష్ఠలు కొంతకాలం నిల్వవచ్చునుగాక యీ విశ్వవిశ్వాలలో కోట్ల కోట్ల అంశాంశమైన కీర్తినిగాని ప్రతిష్ఠగాని తాను చేస్తున్నానని విర్రవీగే కర్మగాని యేమౌతవి? రాజులచరిత్రలు దండకవులలో, అభ్యుదయి రచనలలో కవులచే గానం చేయబడుగాక. కవులయొక్క రసవత్తర ఘట్టాలు, తీయని లోతైన భాషలలో రూపం పొందుగాక. ఈ విశ్వంలో వీని పరిణామము ఎటువంటిది? గంటము నడపడంలో తమకు సవ్య సాచిత్వం ఉండుగాక! తన గంటం వాడి మొననుంచి కావ్యరస ప్రవాహాలు సుడులు కట్టుకొని పోయినవి కాక! అవి తాటాకులలో ఉన్నవి. ప్రతిఅక్షరము క్షరము కానిదా? క్షరముకాని ఆ అక్షరాలను తన హృదయంలో మోసే తాళపత్రం దివ్యశక్తి స్వరూపమా?

ఈ లాంటి ఆలోచనలతో జగ్గన్న తంజావూరిలో తమ కేర్పరిచిన విడుదులలో బసచేసినారు. బృహదీశ్వరుని, బృహన్నాయకిని అర్చించినారు. భోజకృష్ణదేవరాయల అపరావతారమైన శ్రీ రఘునాధ రాయలమహారాజు కొలువులో ఆంధ్రసామ్రాజ్య మహాద్భుతము కన్నులార కనుగొన్నాడు.

గొప్ప వ్రాయసగాడైన జగ్గన్నమంత్రి, మహారాజు తనకోటలో నిర్మించిన సరస్వతీ మందిరానికి యాత్ర చేసినాడు. దారు దంత పేటికలలో సంస్కృతాంధ్ర ద్రావిడ కర్ణాటక గ్రంథాలు వేలకొలదియున్నవి. పూర్వగ్రంథాలు,

112