మూడవ ప్రకరణము
వార్తాపత్రిక - పరారి
ఇట్లు, గ్రంధావలోకన కుతూహలాయత్త చిత్తుండై, కాలమును బెంజమిను గడపుచుండ, నాస్తికాభిప్రాయములు కొన్ని యబుద్ధి పూర్వకముగ నితని నాక్రమించెను. ఇవి మనస్సును వ్యాకుల పెట్టినందున, మిక్కిలి దు:ఖాక్రాంతుడై, కాలక్రమమున యుక్తాయుక్తవిచక్షణ సంపన్నుడై, వీనిని వదలిపెట్టెను. ఇట్లు మనస్సును శుద్ధిచేసి మతమున కెట్టియుపద్రవము రాకుండ, కల్లోలావృతమైన యౌవనకాలమును దాటించినందున కిత డెంతయు కృతజ్ఞత కలవాడై, వృద్ధాప్యమునగూడ పరమేశ్వరుని ధ్యానించుచుండెను.
జేమ్సు ఫ్రాంక్లిను వ్యాపారము నానాట వృద్ధిపొందసాగి, సోదరు లిరువురికి యుత్తరోత్తర మైహిక సుఖములను సంఘటించుకాలము సమకూరెను. బోస్టను పట్టణమందలి 'తపాలాఫీసు' యజమాని యొక వార్తాపత్రికను బ్రచురింపించి ప్రకటన చేయుచుండెను. అచ్చట వ్యవహారరీతిచే మనస్పర్థలు కలిగినందున, నతనిని యా యుద్యోగమునుండి తొలగించి, కొందఱు ప్రముఖులు తమ శ్రేయస్సును బురస్కరించుకొని, మొదటి