పుట:Baarishhtaru paarvatiisham.pdf/35

ఈ పుట ఆమోదించబడ్డది

కువ వచ్చింది. నాపక్కన ఉన్న బ్రాహ్మణ వితంతువు వీపున జార్లబడి ఇంతసేపూ నిద్రపోయినట్లు తెలుసుకున్నాను. ఆవిడ ఇంకా నిద్రపోతూనే ఉన్నది. ఆవిడ వీపున ఇంతసేపూ జార్లా బడ్డందుకు సిగ్గుపడి హఠాత్తుగా లేచి కూర్చున్నాను. పాపము ఆవిడ నన్నానుకొని నిద్రపోతూ ఉన్నది కాబోలు, ఆ సంగతి నా కేమితెలుసును? నేనులేపడముతోటే వెనుకకు ఆవిడ నా ఒళ్ళో పడ్డది. పడగానే ఆవిడ 'గోవిందా, గోవిందా ' అని లేవబోయి మళ్ళీ వెనుకకు పడ్డది. ఆవిడ లేవడానికి పునః ప్రయత్నము చేస్తూఉంటే, పాపము మళ్ళీ పడుతుందేమోనని నా చెయ్యి ఆవిడ వీపుకు బోటుపెట్టి ముందుకు కొంచెము తోశాను. లేచి నా సహాయమువల్ల లేచాను గదా అని సంతోషించడానికి బదులు, కోపంగా 'అదేమిటి అబ్బాయి, కొంచెము దూరంగా కూర్చో కూడదూ, ఊరికే మీదికి రాకపోతే? నీకు తోడబుట్టినవాళ్ళు లేరూ? ఇల్లు బయలుదేరి రావడమే చాలు నే ఒక్కతెనూ; నా బ్రతుకు అంతా ఇలాగనే వెళ్ళుతున్నది. దారిలో ఎరిగున్న వాళ్ళెవరై నా కనబడక పోతారా అని నేటికి తెగించి తిరుపతి వెడదామని బయలుదేరి నందుకు ఈ అవస్థలన్నీ పడవలసి వచ్చింది! ఆ మహారాజు ఉంటే ఇంత అవస్థ లేకపోయేది కదా! చచ్చి స్వర్గాన ఉన్నారు. ఎప్పుడు రాత్రిళ్ళు రైలులో ప్రయాణము చేసినా, ఒసేవ్ నీకు మేలుకుంటే జబ్బు చేస్తుంది, ఎలాగో కాస్త సందుచేసుకొని నడ్డివాల్చ మనేవారు ' అని ఒక మాటు కళ్ళద్దుకొని ఒక మాటు ముక్కు తుడుచుకొని మళ్ళీ ఆవిడ కునికి పాట్లు పడడము మొదలు పెట్టింది.

నేను లఘుశంకకు వెళ్ళవలసి వచ్చింది. ఎక్కడికి వెళ్ళడానికీ, ఏమి చేయడానికీ తోచింది కాదు. ఒక్కమాటు రైలు