అపూర్వబ్రహ్మచర్యప్రహసనము
ఇందువచ్చు పాత్రములు
రామాకాంతము పంతులు -- కథానాయకుఁడు.
కరటకరెడ్డి - పంతులవారి సేవకుఁడు.
వెంకఁడు - తోఁటపనివాఁడు.
సోమభట్టు - పురోహితుఁడు.
శ్యామలాంబ - రామాకాంతము పంతులభార్య.
మోహిని - కరటకరెడ్డి భార్య.
రంగము - రాజమహేంద్రవరము రామాకాంతము పంతులుగారి
గృహము
[ సేవకుఁడు కరటకరెడ్డి ప్రవేశించుచున్నాఁడు ]
కర - ఇక్కడికి రెండు సంవత్సరాలనుంచి నాభార్యను నా యజమానుడి కంటపడకుండా కాపాడుకొనివచ్చినాను, అతనికంట బడితే యికనాకు భార్య ఆశ లేదు. యిదివరకూ నాయజమానుఁడు నేను బ్రహ్మచారిననే భ్రమతోనేవున్నాడు, యీప్రకరంగానే యింకామోసంచేస్తూ నాబుద్ధిబలంచేత యీభ్రమ యెల్ల కాలమూ వుండేటట్టు చేస్తాను. నాకు పెళ్లామువున్నట్టు పంతులుగారికి తెలిసి వున్నట్టయితే యిదివరకే నాకొంప మునిగేది. పెళ్ళాలువున్న యీ వీధివాళ్ళంతా ఆయనజీవానికి వుసూరుమని యేడుస్తూవున్నారు. ఆయన మ్యూనిసిపల్ కమీషనరూ లోకల్ ఫండు మెంబరూ బెంచి మేజస్ట్రీటూ డిస్ట్రిక్టుకోర్టు ప్లీడరూ కావడంచేత యెప్పుడు యేమి చేసిపోతారో అని అందరూ జడుస్తూవుంటారు. వాసుదేవరావు పంతులుగారిభార్య పుట్టింటికి వెళ్ళబోతూవుండడంచేత ఆవిడనిమిత్త