ఈ పుట ఆమోదించబడ్డది

"వంతు నాది" అను పాఠమునకు "జంత్రనాడు" అను పాఠము శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మగారిది. ఝాడదేశ మిప్పుడు జయపూరు, బొబ్బిలి సంస్థానాల భాగమనియు, సప్తమాడె గంజాము మన్నెదొరల సంస్థానాలనియు, బారహదొంతి ఒరిస్సాలోని భాగ మనియు, జంత్రనాడు ఒడ్డాది విశాఖపట్నంలోని వనియు, రంభ అంటే రంప అనియు శ్రీ మ. సో. శర్మగారే తెలిపినారు.[1]

రెడ్డిరాజులు పండువా సుల్తాను నోడించిరి.[2] పండువా బెంగాలులో, ఇప్పటి మాల్డాజిల్లా.[3] ఇట్టి సాహసముల ప్రకటించిన రాజ్యములో మహావీరులు, దండనాయకులు, యుద్ధ కౌశలమం దారితేరిన సేనాధ్యక్షులు పలువు రుండి రనుటయు, వారు అఖిలాంధ్రుల ప్రశంసలకు స్థానము లైరనియు చెప్పుటలో అతిశయోక్తికాని, ప్రత్యేకాభిమానముకాని లేదు. ప్రోలయనాయకుడు, అనవేముడు, పెదకోమటి, కాటయవేముడు, అనపోతరెడ్డి, లింగనమంత్రి, బెండపూడి అన్నయమంత్రి ముఖ్యవీరులన జెల్లిరి. ఇట్టి రాజ్యకాల మందలి సాంఘిక పరిస్థితులెట్టివో తెలిసికొందము.

మతము

రాజు లే మత మవలంభించుచుండిరో జనులలో బహుళ సంఖ్యాకులు కూడా అదే మత మవలంబించుచుండిరి. "రాజానుమతం ధర్మం" అని జనులు విశ్వసించిరి. ఆంధ్రదేశములో కాకతీయుల కాలమందు విజృంభించిన వీరశైవ మింకను ప్రబలముగానే యుండెను. రెడ్డిరాజులు అత్యంత వీరశైవాభినివిష్టులై యుండిరి. శివక్షేత్రముల నుద్ధరించిరి. శ్రీశైలమునకు మెట్లు కట్టించిరి. ప్రతి దినము ఆరుమారులు శివపూజలు చేయుచుండిరి. అనేక యజ్ఞయాగములు చేసిరి. ప్రభువుల ననుసరించి వారి మంత్రులు, సేనానులు శైవమతమునకు వ్యాప్తినిచ్చిరి.

  1. History of the Reddy Kingdoms, P. 137-143, Part, V.
  2. "పండువా సురతాణి పావడం బిచ్చిన" భీమేశ్వర పురాణం. అ 1.
  3. History of Reddy Kingdoms, P. 143, Part, I. (ఇకముందీ గ్రంథమునకు Hist. R.K అను సంకేతమునిత్తును.)