ఈ పుట ఆమోదించబడ్డది

2 వ ప్రకరణము

కాకతీయుల యుగము

రుగంటి కాకతీయ చక్రవర్తులు ఇంచుమించు క్రీ.శ. 1050 నుండి 0750 వరకు రాజ్యము చేసిరి. మన యాది కవియగు నన్నయభట్టు క్రీ.శ. 1050 ప్రాంతములో నుండునట్టివాడు. అతడు తూర్పుచాళుక్యుల కవి. కావున చాళుక్యకాలము, కాకతీయకాలము రెండును కలిసినవి.

నన్నయకన్న పూర్వము తెనుగు దేశములోని మనకు తెలిసిన ఆ కొలదిపాటి విషయాలు తెలియనివాటితో సమానమే. నన్నయకాలమందలి పరిస్థితులు కూడా మనకు సరిగా తెలియవు. మనకు కొంతవరకు తెలిసినభాగము కాకతీయుల కాలమే.

కాకతీయ సామ్రాజ్యముం గూర్చిన సాధనములు - శాసనములు, రచనలు, శిల్పములు, విదేశచారిత్రకుల వ్రాతలు, నాణెములు, కథలు, సుద్దులు - మనకు లభించిన వరకు ఉపయుక్తములై యున్నవి. వీని యాధారముచే మన యాదిచారిత్రిక యుగమందలి ప్రజలయొక్క రాజకీయ నైతిక విద్యావిషయిక, సాంఘికజీవనము లెట్టివో మనకు కొంత కొంత విశద మగుచున్నవి. కాకతీయులు శాలివాహన శకారంభమునుండియే రాజ్యము చేయుచూవచ్చిరని ప్రతాపరుద్రచరిత్ర మను ప్రాచీన గ్రంథములో వ్రాసినారు. కాని అది అబద్ధము. చరిత్రకు గణనకెక్కినవాడు మొదటి కాకతిరాజు ప్రోలరాజు. కావున ఈ ప్రకరణమున క్రీ.శ. 1050 నుండి క్రీ.శ. 1323 వరకు అనగా ఓరుగంటి పతనము వరకు తెలియవచ్చిన ఆంధ్రుల సాంఘిక జీవనమును గూర్చి చర్చింతము.

మతము

మనకు మతము ప్రధాన జీవనవిధానము. కావున దాన్ని గురించియే మొదట విచారింతము. ఆ కాలములో తెనుగుదేశమందు బౌద్ధమత మించు