యక్షగానాలముద్రయే గట్టిగా మనవారిపైబడి దానియందే వారి కభిమాన ముండె ననవచ్చును.
యక్షగానాలలోని పాటలకు అప్పకవి లక్షణాలు వ్రాసెను. ఆ పాట లేవనగా:- పెండ్లిపాట. లాలిపాట (రెండు లక్షణాలొకటే) శ్రీధవళము, సువ్వాలే, సువ్వి, అర్ధచంద్రికలు, ద్విపద భేదాలు, రగడలు, మున్నగునవి (ఉదాహరణాలకు అప్పకవీయము చతుర్థాశ్వాసము చూడవలెను.) ఈ పాటలలో పెండ్లిపాట, లాలి, ధవళాలు, సువ్వాలు, మంగళహారతులు, నేటికిని పెండ్లిండ్లలో పాడుదురు.
'ఆ లలనామణికా గయ్యాళి యొకానొక్క వేళ నక్కరతో, సు
వ్వాలున్ శోభనములు, ధవళాలున్ మొదలైనపాట లందగ నేర్పున్'[1]
అనుటచే ఆనాడు పల్లెలలో స్త్రీ లీ పాటలం దాసక్తి కలవారై యుండిరని యూహింపవచ్చును. శోభనములే శోబాన పాటలు (శుక. 3-349) గొబ్బిళ్ళపాటలు కూడా వ్యాప్తిలో నుండెను. గొబ్బి యనునది గర్బతద్బవమైయుండును. స్త్రీలు వలయాకారముగా చప్పట్లు చరచుచు పాడు పాటల గొబ్బిళ్ళు అందురు. (శుక. 2-434) శిశువుల నిద్రపుచ్చుటకు జోలపాటలు పాడిడివారు. (శుక. 3-450) బాపనమ్మల పాటలకు విశిష్టత యుండెనేమో!
'మన్న పురుషు చెడనాడు మగువ మీద
బోయిపులుగాసి పురువయి పుట్టుననుచు
బాపనమ్మలు చెప్పినపాటమేలె యనుచు
నేమందునిను దూరుకొనగ వెరచి'[2]
అని యొక చాకలిది తన మగనితో ననెను. ఏలపదాలను స్త్రీపురుషులును పాడుకొనిరి. ఇవెక్కువగా బ్రాహ్మణేతరుల పాటలే! (శుకసప్తతి. 2-172) ఏలపదవిధానమును సుగ్రీవవిజయమం దిట్లున్నది.
1 భానువంశమునబుట్టి దానవకామినిగొట్టి
పూనిసుఖము నిర్వహింపవా - ఓరామచంద్ర మౌనివరులు సన్నుతింపగాన్.