అదిజన్మస్థానము. అచ్చట యివి కొల్లలు పచ్చకర్పూరము, హారతి కర్పూరము తూర్పుదీవులనుండి వచ్చెడివి. పారువాతిన్నెలు కూడ అమ్మిరట : (శుత. 3-7) అంటే యేమో నిఘంటులలో లేదు.
బండ్లకు బాటలు యోగ్యముగా లేనందున వ్యాపారము గాడిదలపై, గిత్తలపై, గుర్రాలపై సాగుచుండెను. గుర్రాలపై సరకులతో నిండిన పెరికలెత్తి పంతసంతలకు తిరునాళ్ళకును త్రిప్పుచుండిరి. ఒక గుర్ర మిట్లు వాపోయెను.
"పెరికయే చాలు నానడ్డి విరుగ జేయ
దానిపై దాను నెక్కు........"[1]
"బరువులెత్తిన యెద్దుపై" కూడా వ్యాపారము చేసిరి. (శుక. 2-549)
ఆ కాలములో వ్యవహారములు పలువిధములగు నాణెములలో జరుగు చుండెను. అందు మాడలకే యెక్కువ ప్రాముఖ్య ముండెను. ఓలికి మాడలే ముఖ్యము. మాళ్ళబిందెలను జనులు పూడ్చి దాచుకొనెడివారు. (శుక. 1-495) రూకలు (శుక. 2-25) కూడా విరివిగా వాడుకలో నుండెను. ఒక రూక విలువను దాన్ని పోగొట్టుకొన్న గొల్లది యిట్లు తెలిపినది.:-
"వెలుపల వడ్డి కిచ్చినను వీసము వచ్చును, వట్టు లాయెనో
బలుల వేగ వచ్చునల బాపని కిచ్చినయట్టు లాయెనో
అలయక నాల్గుచట్ల పెరు గమ్మిన రాని.......రూక, నా
వలె నల సంతలోన బడవైచినవారల గాన నెచ్చటన్.
శుక. 2-58.
మరియు పుట్టికనిండుగా ఒకరూకకు బియ్యము లభించెడిది. (శుక. 2-566) కల్లుద్రావు స్త్రీలు "తమ మునిచెరుగులందు కాసుదుడ్డును బంగారు పూస వెండితునక మొదలింటి చిఱువాడు గొనినదెల్ల గొనుచు" గుట్టుగా వెళ్లెడివారు. (శుక. 3-117.) (చిఱువాడుపదము నిఘంటువులలో లేదు.) మినుకులు, టంకాలు, దీనారాలుకూడా వాడుకలోనుండెను. పైకమును జాలెలలో నుంచుకొనిరి. (శుక. 2-216). వాటినే వల్లము, వల్లువము అనిరి. (శుక. 2-365). మాసములలో 'చిట్టి' యొకటి "చిట్టెడు నూనె" నెత్తియంటు
- ↑ శుకసప్తతి. 3-403.