వారలును గల్గి శంబరివైరి సంతపేట
యన నొప్పు నవ్వేశ్యలాటమునను"[1]
(నైచిత్రికి వైచిత్రి యని యుండవలెనేమో?)
గొల్లపడుచులు పెరుగు, పాలు, వెన్న అమ్ముకొని జీవించెడివారు. అందు కొందరు 'దది తక్ర విక్రయంబు లుపదేశమాత్రంబులుగా జారాన్వేషణంబులు ప్రధాన కార్యంబులుగా సమీప జనపదంబుల నుంచి వచ్చియున్న యాభీర భీరువులై యుండిరి.' (శుక. 3-540)
వ్యవసాయము - వ్యాపారము
రాజులే కాక మంత్రులు, వారి భార్యలును చెరువులు కట్టించుచుండిరి' గుంటూరు మండలములో వంకాయలపాడు అను గ్రామములో గోపీనాథ సముద్ర మను చెరువును రామయభాస్కరమంత్రి సోదరియగు చిన్నాంబ కట్టించి, శా.శ. 1462లో శాసనము వ్రాయించెను.[2] అదే విధముగా కడప జిల్లాలోని సిద్ధవటము చెరువును శా.శ. 1527లో మట్ల అనంత భూపాలుడు కట్టించి శాసనము వ్రాయించెను. [3]
ఆ కాలపు వ్యవసాయ వ్యవస్థ ఆయగాండ్ల పద్ధతి, మిరాసీలు, మున్నగు వివరాలు తెలుపునట్టి తామ్రశాసన మొకటి కర్నూలు జిల్లా పెద బెళగళ్ళు గ్రామకరణం దర్మన్నవద్ద నుండు దానిని శ్రీ మానవల్లి రామకృష్ణ కవిగా రించుమించు 40 ఏండ్ల క్రిందట వనపర్తిలో ప్రకటించెను. అందలి ముఖ్య విషయాలను అందున్నట్లుగానే యిచ్చట నుదాహరింతును.
"శా.శ. 1414 లో శ్రీకృష్ణదేవరాయలు నాయకసమూహాన వచ్చిన ముమ్మడి రెడ్డినాయక మొదలైనవారికి మిరాశి, రెడ్డి మొరాశీలు యిచ్చిన వివరం:- గొల్లలు పాలెగాళ్ళు అయి, దుర్గాలు సగనీయక చాలా వుపద్రవం చేస్తూవుండగా వారిని మీరు గెల్చినారు కనుక మీకు చెరువు బెళగళ్ళు ఆదిగాను చామల గూడూరు కంభంపాడు తిమ్మనదొడ్డి మొదలైన షోడశస్థలాలకు అయినారు