భోగస్త్రీలు:-
భోగముయువతులు బుధ శనివారములందు శిరస్స్నానము చేసెడివారు. మినుపపిండి నలుగుగా వాడెడివారు. "తల నిమ్మపండ్ల జొబ్బిలపిండి, సీకాయ బులిమి, తైలపు జిడ్డువోవ దువ్వి" తర్వాత మడుగు వల్వలు ధరించి అలంకరించుకొనెడివారు. [1] బీదవారు నూనెపోవుటకు "అటకలి" రుద్దుకొనెడివారు. (శుక. 2-378.) జొన్నపిండిలో కలిబోసి ఉడుకబెట్టిన దానిని అటకలి యందురు. భోగము పడుచులు తొలిసారి దేవతా సన్నిధిలో నాట్యము చేసి తర్వాత నాట్యమును వృత్తిగా సాగించెడివారు.
"తొలువినికి నభవుముందట నలికుం
తల పుష్పగంధి యాడెడు ననుచున్
కలయంగ పురములోపలపొల
తుక చాటించె దిశలు భోరున గంగన్.[2]
(తొలువినికి పదము నిఘంటువులలో లేదు. మొదటిసారి సంగీతమును సభలో వినిపించి నాట్యమాడుటకు తొలువినికి యందురు.)
బోగంవారి పడుకటిండ్లు చాలా ఆకర్షణీయములు. బంగారు కాళంజి (తమ్మపడిగె), పూలపాన్పు, సకినెల పట్టెమంచము, కుంకుమ తలగడ, సురటి, నిలువు టద్దము, దంతపు వావలు మున్నగున వందుండెను.[3] తాపితా (పట్టు) పరుపు, పట్టుతలాడము (తలగడ), పడిగము, కంచు దీపపు కంబము, పట్టె మంచము ఇవి 'రతిధామము' లో నుండెడివి. [4]
ఎండకాలమందు బాటసారులు పడిన పాట్లు:-
"చక్కెర చింతపం డొడిని, సందిట నేలకి చద్ది, మౌళిపై
జెక్కిన కానుగాకు, వలచే జలకుండిక, వీజనంబు వే