"వేములవాడ భీమ! భళిరే! కవి శేఖర సార్వభౌమ! నీ
వేమని యానతిచ్చితివి యిమ్ముల గోమటి పక్షపాతివై
కోమటి కొక్కటిచ్చి పది గొన్నను దోషము లేదటంటివా?
కోమటి కొక్కటీక పది గొన్నను ధర్మము ధర్మ పద్ధతిన్."[1]
మల్హణకవి ఒక కోమటినోటనే యీమాటలు చెప్పించెను.
"దైవాలకును రిత్తదండాలు గిండాలు గాని యెన్నడు నొకకాసు నీయ,
కవి గాయకులు వచ్చి గణుతించి వేడిన వదలిపోవుటెగాని పైకమియ్య
చుట్టాలకును వట్టిసుద్దులు దుద్దులు గాని యెన్నడును డగ్గరగ నీయ
బైత్రోవ వచ్చిన పరదేసి యొరదేసి మోసపుచ్చుటె గాని గాసమీయ
పట్టుకొని బందికాంద్రను బాధపెట్ట బెంచులే చూప నొక బలువీసమైన
బ్రహ్మరాక్షసి శాకిని ప్రతిదినంబు కూతలే కాని ముద్దెడుకూడు వెట్ట."
మరియు "బాపలకు గోదాన మియ్యను, వడ్డికాసులవల్ల బ్రదుకుదు. ఈగకు, పాముకు బలిపెట్టను. ఎంగిలిచేత కాకి నేయను" అని అన్నాడు.[2] ఈ భావములన్నియు పక్షపాత యుక్తములే. అవచి తిప్పయ వంటి వారెందరో యుండలేదా ?
కట్టె లమ్మకము:-
ఆ కాలములో అడవి సుంకాలుండెను. కట్టెల నెత్తిమోపు కింత యని తీసుకొనెడివారు. మొదలే సుంకము చెల్లించి అడవిలోనికి పోవలసియుండెను. ఒక బీదవాడు కట్టెలకై పోయిన విధానమిట్టిది:-
"వలనగు పుట్టగోచి బిగు వాళ్ళును సుంకపు కాసులున్ విభా
సిలు కరసాన గొడ్డలియు, చిక్కమునన్ సొరకాయ బుర్రలో
చలిదియు నుంచి.......నరిగెన్ గహనంబునకై రయంబునన్.[3]
బిగువాళ్ళు అనునది నిఘంటువులలో లేదు. బిగువగు వార్లుకల చెప్పులని యర్థము.