మటించిన కుంచెడంత సాదముగాక, కాదేని యొక గుల్ల కాసుగాక దాచికొన్నను బలితంపుజింపుడు గాక, సిక్కిన నొక పోకవక్కగాక...."[1]
అవి పూజారులనుటచే వారు గుడిపై జీవించువిధానము కానరాగలదు. "ధర్మసత్రపు బ్రాహ్మణులు" పలువురుండిరి.[2]
లక్ష్మీదేవిపండుగను జనులు చేసెడివారు. దీనిని శరత్కాలమున చేసిరి. ఆ పండుగనాడు విటులు బోగమువారికి "పండుగదండుగలు" సమర్పించుకొనిరి.
"మింఠజనదత్త మేషి కంఠసముద్బూత రవము కడు నెమ్మది, ను
త్కంఠ సలిపె వేశ్యాకలకంఠుల కత్తరి గృహోపకంఠములందున్."
ఈ విధముగా రూకలు, కోకలు, ఆకులు, పోకలు, మేకలు ఇవన్నీ సానులకు కానుకలుగా విటు లంపిరి.[3] ఈ వర్ణననుబట్టి యీ పండుగ దీపావళి పండుగయని తోచును. నేటికిని దీపావళినాడు బోగపుసానులు ధనికులయిండ్లకు వేకువన వెళ్ళి, మంగళహారతు లిచ్చి అనుగ్రహీత లగుదురు.
సంతానము లేకుండిన పున్నామనరకములో పడుదురని శాస్త్రాలలో పూర్వకాలపువారు వ్రాసి పోయినందున, హిందువులలో నేటివరకును పడరానిపాట్లు పడుతున్నారు. ఆ కాలములో సంతు లేనివారి యవస్థలు మరీ యెక్కువగా నుండెను.
"ఉపవాసంబులు, సత్య ధర్మ మహితోద్యోగాది కృత్యంబులున్
జపముల్, విప్రకుటుంబభోజనములున్, శాంతుల్ పయస్పత్రముల్,
తపముల్ దైవతపూజనక్రియలు, తీర్థస్నానముల్, దానముల్,
విపరీతప్రతిబంధమోక్షణవిధుల్, వేమారు గావించుచున్."
ఇంతేకాక బహువిధ దేవతాస్తోత్రాలు పఠించుట, పొర్లుదండాలు పెట్టుట, చూసిన వల్పుల కంతా మొక్కుకొనుట, చెప్పిన దానాలు చేయుట పరిపాటియై యుండెను.[4]