దుర్బలతలో నున్నదనియు, అల్లావుద్దీన్ ఖిల్జీ గుర్తించి దక్షిణాపథముపై బడెను.[1]
హిందువుల మరొక లోప మేమన, వారు శత్రువులపై గెలుపొంది నపుడు మరల శత్రువు తల యెత్తకుండా గట్టి చేసుకొన్నవారు కారు. రాయచూరు యుద్ధములో ముసల్మాను లోడిపోగా వారిని పూర్తిగా తుడిచివేయ వలెనని సేనాను లొత్తి చెప్పినను శ్రీకృష్ణదేవరాయలు వినక పారెడి వారిని సంహరించుట ధర్మము కాదని వాదించెనని విదేశీయుడగు నూనిజ్ చకితుడై వ్రాసి యుండెను.[2] అతడు ఉమ్మత్తూరును గెలిచి నప్పుడు ఓడిన రాజులనే మరల అందు నెలకొల్పెను. ముసల్మానుల యుద్ధతంత్ర మట్టిది కాదు. శత్రువు విరిగినప్పడు వానిని పూర్తిగా భస్మముచేసి, వానియొక్కయు, వాని ప్రజల యొక్కయు, ధనమును పూర్తిగా లాగుకొని, వారి నగరములను నాశనము చేసి తలచినన్ని ఘోరాలు చేయుట వారు నేర్చిన రాజనీతి.
దేవగిరి, ఓరుగల్లు, కంపిలి, విజయనగరము శిథిలాలే వారి చర్యలకు సాక్ష్య మిస్తున్నవి. మలిక్ కాఫిర్ దక్షిణాపథమును దోచి 312 ఏనుగుల పయిన ధనమును, 96,000 మణుగుల బంగారును అసంఖ్యాకమగు ముత్యాల రత్నాల పెట్టెలను, 12,000 గుర్రాలను తీసుకొని డిల్లీ చేరెను.
హిందూ సైనికులు ముసల్మానులవంటి సైనికభటులు కారు. ముసల్మాను సైన్యములో అరబ్బులు, ఖురాసానీ తురకలు, పారసీలు, అబిషీలు (అబిసీనియనులు), పఠానులు, బిల్లులు, మున్నగు అటవికులు ఉండిరి. తమ సైనికులు తురక భటులకు సరిరారని విజయనగర చక్రవర్తులు గుర్తించి, తురకలను తమ సైన్యములో భర్తీచేసి, వారికొక "తురకపేట"ను ప్రత్యేకించి వారికి మసీదులు కట్టించి సకల సదుపాయములు చేసిరి. అట్లు చేసినను వారికి హిందూ రాజులపై విశ్వాస ముండినటుల కానరాదు. వారు తమ ఏలికలకు సలాములు కూడ చేయుటకు ఇష్టపడనందున ఏదోవిధముగా తమ గౌరవము నిలుపుకొనుటకు