గలు గలు గల్లు గల్లు రన
కంటక మంత్రుల గుండె లన్నియున్
జలు జలు జల్లు జల్లు రనె
సత్కవివర్యులు మేలు మే లనన్."[1]
వడిగా వ్రాయుట, ముత్యములవలె ముద్దుగా వ్రాయుట తాటాకుల గ్రంథాలకు చాలా యవసరమై యుండినందున ఆ కాలమువారి వ్రాతలు చాలా సుందరములై యుండెను. అట్టివారిలోకూడా కాటయవేముని వ్రాయసకాడు (రాయసం) అగు బాచమంత్రి అక్షర రమ్యత మరీగొప్పగా పొగడ్త కెక్కెను.
తాటాకులనే ప్రధానముగా వాడినను జనులకు కాగితము అలవాటు తెలియదని కాదు.
"దస్త్రాలుం మసిబుర్రలున్ కలములుం
దార్కొన్న చింతంబళుల్
మున్నగునవి శ్రీనాథుడు చూచియే యుండెనుకదా!
"కన్నుల పండువై యమరు
కాకితమందలి వర్ణ పద్దతుల్"[2]
అనుటచే రాజులు, మంత్రులు కాగితముల వాడుచుండిరి. కాగితశబ్దము కాగజ్ అను పార్సీ శబ్దమునుండి వచ్చినది. అనగా ఈ పరిశ్రమను తురకలు తెచ్చిరన్నమాట. ఆదిలో కాగితములను కనిపెట్టినవారు చీనావారు. కాన వారి నుండియే తురకలు ఆ విద్యను నేర్చిరి. నేటికిని చేతికాగిత పరిశ్రమ విశేషముగా తురకలలోనే కలదు.
తాత్కాలికముగా పనియిచ్చునట్టి వ్యవహారములందు పలువురు తాటాకులపై మసిలో అద్దిన, గలుగు కలములతో వ్రాసెడివారు.
"వెసవ సుదాస్థలంబున కవీంద్రులు కొందరు శేముషీ మషీ
రసము మన: కటాహ కుహరంబుల నించి కలంచి జిహ్వకా