పుట:Andrulasangikach025988mbp.pdf/115

ఈ పుట ఆమోదించబడ్డది

పూర్వమునుండియే అవి యుండెను. రాజమహేంద్రవరమునకు 11 మైళ్ళ దూరమునున్న కోరుకొండలో రాజ్యముచేసిన ముమ్మడినాయకుని రాజ్యములో కోనసీమ, అంగరసీమ, కొఠామసీమ, కురవాటసీమ చాంగలునాటిసీమ మొదలగు సీమలు చేరియుండెను. ఇవన్నియు గౌతమీనది కిరుప్రక్కల వ్యాపించి యుండెను. ఈ రాజ్యము అరటి, కొబ్బరి, పనస, పోక, మామిడి మొదలగు తోటలలో రమ్యమై ఆంధ్రభూమిని ప్రసిద్ధిగా నున్నదని యార్యవట శాసనమున వర్ణింపబడినది.[1] "శ్రీశైల పూర్వనికటమునుండి పూర్వ సముద్రముదాక ప్రవహించుకుండి తరంగిణి యను గుండ్లకమ్మనది కిరుపక్కలనుండు సీమకే పూంగినాడను నామము కలదని తెలియుచున్నది.[2]

ఇట్టి సీమలు దేశ మంతటను అనంతముగా నుండెను. కాని, రెడ్డిరాజులు తమ పరిపాలన సౌకర్యమునకై తమ రాజ్యమును కొండవీడు, వినుకొండ, బెల్లముకొండ, అద్దంకి, ఉదయగిరి, కోట, నెల్లూరు, మారెళ్ళ, కందుకూరు, పొదిలి, అమ్మనబ్రోలు, చుండి, దూపాడు, నాగార్జునకొండ అని విభాగములు చేసిరి.[3]

పల్లవులు, కాకతీయులు దేశమందలి అడవులను కొట్టించి, గ్రామాలను ప్రతిష్ఠించి, వ్యవసాయకులకు భూము లిచ్చియుండిరి. దీనినిబట్టి క్రీస్తుశకము 1000 కి పూర్వము కర్నూలు, బళ్ళారి మున్నగు మండలాలు అరణ్యప్రాంతాలుగా నుండెనని తెలియును. ప్రతాపరుద్రుడు స్వయముగా కర్నూలు సీమకు వెళ్ళి అడవుల గొట్టించి ఇప్పటికి కర్నూలు పట్టణమునకు 10, 15 మైళ్ళ ఆవరణములోని పల్లెల పెక్కింటిని నిర్మాణము చేసినట్లు ఆకాలపు శాసనాదుల వలన తెలియవచ్చెడివి. తెలంగాణములో నూరేండ్ల క్రిందటకూడ అడవులనుకొట్టి రైతుల ప్రతిష్ఠించుతూ వచ్చిరనిన ఆకాలపుమాట చెప్పనవసరము లేదు.

ఇప్పటివలె భూములను పట్టాకిచ్చు పద్దతి ఆనాడు లేకుండెను. భూమి యంతయు రాజుదే అను సిద్ధాంతము అంగీకరింపబడి యుండెను. భూమిని

  1. ఆంధ్రుల చరిత్రము, 3భా. పు, 122.
  2. ఆంధ్రుల చరిత్రము, 3భా. పు, 138.
  3. Hist. R. K. Page 218.