పుట:Andrulasangikach025988mbp.pdf/104

ఈ పుట ఆమోదించబడ్డది

దీనిపై శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారిట్లు అనుబంధించినారు, "శ్రీశైలముపై కర్మారీశ్వరము అని యొక పుణ్యస్థలమున్నది. అది కొండకొమ్ము, అక్కడనుండి భక్తులు పుణ్యలోక ప్రాప్త్యర్దమై నేలకురికి ప్రాణత్యాగము చేయుదురు. క్రిందబడుచున్నవాడు, అంతరాళమున నున్నవాడు, ఉరుక నున్నవాడు, అన్న క్రమమున ఎడతెగకుండ శివరాత్రినా డక్కడ భక్తులు ఉరుకుచునే యుండెడివారు.

         "కరమర్థిజేసి యా కర్మారి నురుకు
          ననఘుల భవపరిత్యక్త మానసుల
          అరిమురి నవలి కర్మారీశ్వరమున
          నురుకు పుణ్యుల జూచి ......
          పడియెడు దేహంబు పడిన దేహంబు
          నడిమి దేహంబు లెన్నంగ బెక్కాడు"

అని పండితారాధ్య చరిత్రమం దున్నటుల శ్రీ వే. ప్ర. శాస్త్రిగారు వ్రాసినారు.

పండితారాధ్యచరిత్ర తుదిభాగమందు కర్మహరి మహిమ అను భాగము కలదు. (పుట 472. ఆంధ్రపత్రికా ప్రచురణము) అందిట్లున్నది.

"ఇదె చూడు కర్మహరేశ్వరం బనగ"

అచ్చట పూర్వము బల్లహుడను రాజు తన భార్యతోకూడ మల్లికార్జునుని ధ్యానించుతూ కొండకొననుండి పడి శివైక్య మొందెనని పండితారాధ్యమందు వ్రాసినారు. "కర్మారిపదమే తెనుగున కనుమారి యయినది" అని శ్రీ వే. ప్ర. శాస్త్రిగారువ్రాసిరి, తిక్కన, నాచనసోమన, ఉభయులును కనుమారి యనియే వాడిరి. తెనుగుపదాలను సంస్కృతము చేయుటకూడా పరిపాటిగా నుండెను. కనుమారినే కర్మారి, కర్మహరి, కర్మహరేశ్వరము, అని మార్చిరో యేమో, కనుచుండగానే మారికి (చావునకు) బలియగుటను బట్టి కనుమారి పద మేర్పడి యుండును. వీరశైవము ముదిరిననాడు,

        గళముల జిహ్వల కర్ణరంధ్రముల
        కడుపుల, మెడల, వక్షముల, పుక్కిళ్ళ,