పుట:Andhrula Charitramu Part 2.pdf/126

ఈ పుట ఆమోదించబడ్డది

"సీ. స్వారాజ్య పూజ్యుండొ కౌరవాధీశుండొ
నాగ భోగమున మానమున నెగడె,
రతి నాథుడో దినరాజ తనూజుడో
నాగరూపమున దానమున నెగడె,
ధరణీధరేంద్రుడో ధర్మసంజాతుడో
యనగ ధైర్యమున సత్యమున నెగడె,
గంగాత్మజన్ముడో గాండీవ ధన్వుడో
యనగ శౌచమున శౌర్యమున నెగడె,


గీ. సూర్యవంశక భూపాల సుచిర రాజ్య
వనవసంతుండు బుధలోక వత్సలుండు
గౌతమాన్వయాంభోనిధి శీతకరుడు
కులవిధానంబు కొట్టరు కొమ్మశౌరి."


కాబట్టి కొమ్మనామాత్యుడొక సామాన్య కరణముగా నుండవచ్చునని చేసిన ప్రశంస యప్రశస్తమైనదనియు, నిరాధారమైనదనియు జెప్పుట కెంత మాత్రము సందియము లేదు. ఇట్టి కొమ్మనామాత్యునకును అన్నమాంబికకును జనియించినవాడు మన ఈ తిక్కనసోమయాజి. ఇతడు మనుమసిద్ధి రాజు కడ మంత్రియు, గవియునై విఖ్యాతి గాంచెను. ఇతడు సిద్ధిరాజుకడ మిక్కిలి మనన గలవాడై యతని తోడ సమానప్రతిపత్తి గలవాడై వరుసచే బిలువబడుచున్నట్లును, నట్టి వరుసలలో మనుమక్షమావల్లభున కీ కవి మామ వరుసగలిగియున్నట్టును నిర్వచనోత్తరరామాయణము మొదట తిక్కన కవిని గూర్చి మనుమభూపతి చెప్పినటులున్న ఈ క్రింది పద్యమును బట్టి విస్పష్టమగుచున్నది.

"క. ఏ నిన్ను మామ యనియెడు
దీనికి దగనిమ్ము భారతీ కన్యక నా
కీనర్హుడ వగు దనినను
భూనాయకు పలుకు చిత్తమున కింపగుదున్."