పుట:Andhrula Charitramu Part 2.pdf/120

ఈ పుట ఆమోదించబడ్డది

బిందెనుంచి దానికి నులకమంచమును చాటుపెట్టి దానిమీద బసుపుముద్దయుంచెనట? దానింజూచి సిగ్గుపడి ఖేదపడుచుండగా,భార్య _

"క. పగఱకు వెన్నిచ్చినచో
నగరే నిను మగత్ పంపు నాయకులందున్
ముగురాడువారమైతిమి
వగసేటికి జలకమాడవచ్చినచోటన్"
అని యెకసక్కెములాడెనట!

అన్నములో బోయునప్పుడు పాలు విరిగిపోగా తల్లి సైతము పరిహాసముగా_

"కం. అసదృశముగ సరివీరుల
బసమీరగ గెలువలేక పందక్రియన్నీ
వసివైచి విరిగివచ్చిన
బసులు న్విరిగినవి, తిక్క! పాలున్విరిగెన్"

అని పలికెనట! ఇంక జెప్పవలసినదేమున్నది? ఇట్లీపలుకులెల్లను శూలములైనాట మానాభిమానియైన యమ్మహాయోధుడు చేసినపనికి బక్సాత్తప్తుడై "ఈ సారి మరలబోయి శాత్రవులను మార్కొని జయంబుగొండు. అయ్యది సంప్రాప్తంబు గాదేని ప్రాణం బుండుదనుక బోరాడి వీరస్వర్గమునైన జూరగొందు. మానాభిమానములుగల శూరుడిట్టి రోత బ్రదుకు బ్రదుకడు." అని తలపోసి, యెవ్వరెన్ని విధముల వారించినను వినక, సిద్ధిరాజు నోడంబరిచి మరల సైన్యముం గొనిపోయి శత్రువులను మార్కొని భీమసంగ్రామంబు గావించెను. చరిత్రకారుడు యుద్ధభూమిని నాతండు చేయుచున్న యుద్ధక్రమము నిట్లభివర్ణించుచున్నాడు.

"చ. పదటున వాజి రాహుతుల పై దుమికించుచు దిక్కడార్చినన్
బెదరి పరిభ్రమించి కడుబిమ్మట వీరులు భీతచిత్తులై
యదెయదెడాలు వాల్మెరుగులల్లవె యల్లదె యాతడంచనన్
గొదుకక యాజి జేసె రిపుకోటులకందర కన్ని రూపులై"