పుట:Andhrula Charitramu Part 2.pdf/100

ఈ పుట ఆమోదించబడ్డది

లమెయం జోళుని భూమిపై నిలిపి చోళస్థాపనాచార్య నా
మము దక్కంగొని తిక్కభూవిభుడు సామర్థ్యంబు చెల్లింపడె?"

ఈ పై పద్యములలో నితడు శంభురాజాది శత్రువులను జయించి కాంచీపురమును బాలించెననియు, చోడుని సింహాసనము పైనుంచి చోడస్థాపనాచార్య బిరుదమును గైకొనియెననియు చెప్పబడియున్నది. ఈ పద్యములలో జెప్పబడిన విషయములన్నియు సత్యములనుటకు సందియము లేదు. మూడవ కులోత్తుంగ చోడ చక్రవర్తికి వెనుక రాజ్యపదవిని వహించిన మూడవరాజరాజచోడుడు సమర్థుడుగాక మిక్కిలి బలహీను డగుట వలన ను, గృహకలహముల వలనను, మధ్య గొంతకాలము రాజ్యమును బోగొట్టుకొనవలసిన వాడయ్యెను. ఇతని కాలమున మారవర్మ సుందర పాండ్య మహారాజు వలనను, కర్ణాటక వీరసోమేశ్వరుని వలనను, పల్లవుండైన కొప్పరింజింగ దేవుడను మహామండలేశ్వరుని వలనను, రాజ్యమునకుపద్రవము సంభవించెను. మహా మండలేశ్వరుడైన యీ తిక్కభూపాలుడు పాండ్యులను, కర్ణాటక వీరసోమేశ్వరుని జయించి, రాజరాజచోడుని సింహాసనమున నిలిపి చోళస్థాపనాచార్యుడను బిరుదము వహించెను. గాంగవాడి దేశమును బరిపాలించుచుండిన హోసిలరాజయిన వీర సోమేశ్వరుని శాసనములు క్రీ.శ. 1234 మొదలుకొని 1253 వరకును గానంబడుచుండుట చేతను, అతనితో తిక్కభూపతి సమకాలికుండని చెప్పబడియుండుటచేతను, తిక్కరాజు కాలము మనకు స్పష్టముగా దెలియుచున్నది. వీరసోమేశ్వరుడు గూడ చోళని సింహాసనమున గూర్చుండబెట్టెననియు, అతడును తిక్కభూపాలుడు నొండొరులతో బోరాడుచుండిరనియును, దెలియుచుండుట చేత, నిరువురును చోళ సింహాసనమునకై పోరాడువారిలో జెరియొక ప్రక్కను జేరి యుద్ధము చేసిరని యూహింపనగు. కాంచీపురములోని ఆరుళాళప్పెరుమాళ్ళ యాలయములో క్రీ.శ.1233_1234వ సంవత్సరమున నీతిక్కనృపతి పేరిటనొక దానశాసనము గానంబడుచున్నది.