ఈ పుట ఆమోదించబడ్డది

సంబంధము గలుపుకొనినయెడల తమ గౌరవము హెచ్చఁగలదని తలచి, మహారాష్ట్రులలోనుండి యాంధ్రులు పుట్టిరని యొక సిద్ధాంతముగల్పింపఁ జొచ్చిరి! కాని యితరులపేరు చెప్పుకొని బ్రతుకునంత హీనస్థితి మన కక్కరలేదనియు, మహారాష్ట్రుల నుండి యాంధ్రులు పుట్టుటకు మాఱుగా, ఆంధ్రులనుండియే మహారాష్ట్రులు పుట్టినఁ బుట్టియుండవచ్చుననియు, పూర్వమొకప్పుడు రాజ్యవిస్తారమునందును, ఉన్నతనాగరికతయందును, బుద్ధివైభవమందును, ఆంధ్రులు హిందూదేశమందలి యన్య రాష్ట్రములవారికిఁ దీసిపోయినవారు కారనియు, ఈ చరిత్రవలన స్పష్టపడఁగలదు. చంద్రగుప్తుని కాలమందు హిందూ దేశమునందెచ్చట, మగధ రాజ్యముదప్ప ఆంధ్ర రాజ్యమును మించిన ప్రభుత్వము మఱియొకటిలేదు. తరువాత నాంధ్రులుత్తరమున మగధ రాజ్యము, పశ్చిమమున మహారాష్ట్రము వఱకును, దిగ్విజయము చేసిరి. ఈ రాజులే పురాణములలోను, శిలాశాసనములలోను ఆంధ్రులనియు, శాతవాహను లనియు, శాలివాహను లనియు విఖ్యాతిఁ జెందియున్నవారు. శాలివాహన రాజులు ఆంధ్రదేశము నుండి మహారాష్ట్ర దేశమునకు వెళ్లినవారేకాని, మహారాష్ట్రదేశమునుండి యాంధ్రదేశమునకు వచ్చినవారు కారు. ఇది మహారాష్ట్రులును, విద్వద్వర్యులను అగు డాక్టరు భాందార్‌కర్ గారు ఒప్పుకొన్న విషయమే.


ఇఁకముందు మాచేఁ బ్రకటింపబడు గ్రంథమలులో గ్రంథకర్తయొక్క పటముండవలయునని మండలి వారు తీర్మానించియున్నారు. పూర్వపు గ్రంథకర్తల పటములుగాని చరిత్రలు