పుట:Andhrula Charitramu Part-1.pdf/399

ఈ పుట ఆమోదించబడ్డది

దేశము కదంబుల వశమయ్యెను, ఈ ప్రాచీనకదంబులు జైనమతావలంబకులు. ఉత్తరకర్ణాటములోని వనవాసిగాక ఇప్పటి బల్లారి మండలములో హర్పనహళ్లి తాలూకాలోనున్న ఉత్సంగి దుర్గమొక ప్రధానపట్టణముగానుండెను. దీనికి నాలుగుమైళ్లదూరమున మైసూరు సరిహద్దులోనున్న అనాజియను ప్రదేశమున నాలుగవశతాబ్దములోని దై కదంబులకును కాంచీపురపల్లవులకును జరిగినయుద్ధమును దెలిపెడిశాసనమొకటి గానిపించినది. [1] హిరాహడగల్గియును ప్రదేశమున శివస్కందవర్మయను పల్లవుని శాసనమొకటి గన్పట్టుటచేత నాకాలమునందతడీ ప్రదేశమును జయించి పరిపాలించెనని చెప్పదగును. ఆఱవశతాబ్దమునందు చాళుక్యులీదేశమునకు బ్రభువులయిరి. రెండవపులకేశివల్లభుని శాసనమొకటి బల్లారి మండలములోని కురుగోడు గ్రామముకడనున్నది. చాళుక్యలీప్రదేశమును జయించినపుడు కదంబులకులోబడి యీదేశములో గొంతభాగమును బరిపాలించుచుండిన నలరాజులను కీర్తివర్మ మహారాజునాశముజేసెను. తరువాత మొదటివిక్రమాదిత్యుడు అనంతపురమండలములో మడకశిరతాలూకాలో నున్న రత్నగిరి గ్రామములోని కొంతభూమి నొకబ్రాహ్మణునకు దానముచేసి శాసనము వ్రాయించెను. ఆ శాసనములో నీ ప్రదేశము నలవాడివిషయములోనిదని పేర్కొనబడియుండెను. చాళుక్యులు మొట్టమొదట జైనమతావలంబకులుగ నుండిరి. తరువాత పౌరాణిక మతమవలంబించిరి. క్రీ.శ.757 వ సంవత్సరప్రాంతమున రాష్ట్రకూటులు చాళుక్యులు సామంతులయిరి. ఈ చాళుక్యులలో నొక కొందఱు బల్లారిమండలములోని కొగలినాడు (హడగల్లి హర్పనహల్లితాలూకాలు) పాలించుచుండిరి. ఆ కాలమునందే కొంతభాగము నలంబులనియెడు పల్లవులవశమయ్యెను. దీనినే నలంబపాడియని పిలిచిరని పైనిజెప్పియుంటిమి. ఈ నలంబులు రాష్ట్రకూటులకు లోబడియుండిరి. ఆంధ్రచోడులాఱవశతాబ్దమునుండి స్వతంత్రులై పదవశతాబ్దమువఱకును బాలించిరిగాని కడపటిభాగమునందు రాష్ట్రకూటులకు లోబడిన సామంతమాండలికులుగ నున్నట్లే గన్పట్టుచున్నది. వైదుంబరాజులును గొంతకాలము రాష్ట్రకూటులకును దరువాత చోడులకును లో

  1. Mysore. I of 499.