పుట:Andhrula Charitramu Part-1.pdf/253

ఈ పుట ఆమోదించబడ్డది

నకు బదులుగా ఋతువు పేర్కొనబడినది. చాంద్రమాన పక్షముగాక సౌరమానపక్షముయొక్క సంఖ్య పేర్కొనబడినది. ఇట్టిపద్ధతి యేకాలమునం దేవంశపు రాజుల శాసనములలో నవలంబింపబడియెనో తెలిసికొన్న పక్షమున శివస్కందవర్మ కాలము తెలియగలదని నిశ్చయించి నవీనపల్లవులయొక్కయు, క్షాత్రపులయొక్కయు, గుప్తులయొక్కయు, చాళుక్యులయొక్కయు, శాసనములనుబరిశోధించి చూడగా సమస్తవిషయములయందు నాంధ్రభృత్యుల శాసనములలోని పద్ధతిని బోలి యుండుటచేత శివస్కందవర్మ యాకాలమునందె యుండవలయునని సిద్ధాంతీకరింపబడినది. క్షాత్రపరాజులయొక్కయు, గుప్తరాజులయొక్కయు, చాళుక్యరాజులయొక్కయు, నవీనపల్లవరాజులయొక్కయు శాసనములన్నియు సంస్కృతభాషలో వ్రాయబడినవి. క్షాత్రపుల శాసనములలో శకనృపకాల సంవత్సరములును, గుప్తరాజులశాసనములలో గుప్తశకసంవత్సరములను, చాళుక్యరాజుల శాసనములలో శాలివాహన శకసంవత్సరములును పేర్కొనబడినవి. సర్వవిధములచేతను స్వల్పవిషయములందుకూడ నాశాసనములను భేదించి యుండుటయే గాక యాంధ్రభృత్య వంశపురాజులగు గోతమిపుత్రశాతకర్ణి, పులమాయి, యజ్ఞశ్రీశాతకర్ణి మాధారిపుత్రశకసేనుడు మొదలగు వారి శాసనములనుబోలి యించుకయై న భేదములేక యుండుటచేత నీశాసనముగూడ నా కాలమునాటిదే గనుక శివస్కందవర్మ రెండవశతాబ్ద మధ్యముననో శతాబ్దాంతముననోయుండయుండవలయునని రివరెండు ఫౌల్క్సుగారు నుడువుచున్నారు. ఆంధ్రభృత్యులనియెడిశాతవాహనవంశజులు క్రీస్తుశకము 236 వ సంవత్సరమువఱకు నాంధ్రదేశమును బాలించుచుండిరని శాసనాదులనుబట్టియు పురాణాది పూర్వగ్రంథములనుబట్టియు దెలిసికొనగలిగితిమి. క్రీస్తుశకము 340 దవ సంవత్సర ప్రాంతమున గుప్తచక్రవర్తియగు సముద్రగుప్తుడు దక్షిణదేశముపై దండెత్తివచ్చినప్పుడు విష్ణుగోపవర్మయనురాజు కాంచీపురమునుబాలించుచుండినట్లు ప్రయాగలోని సముద్రగుప్తుని శాసనమువలన దెలియవచ్చుచున్నది. శివస్కందుడు విష్ణుగోపవర్మకు బూర్వుడు కాని తరువాతివాడు కాడని శివస్కందవర్మ శాసనములనుబట్టి స్పష్టముగా జెప్పవచ్చును.