పుట:Andhrula Charitramu Part-1.pdf/185

ఈ పుట ఆమోదించబడ్డది

శివశ్రీశాతకర్ణి.

(క్రీ.త 158 మొదలుకొని క్రీ.త 165 వరకు)

ఇతడును గోతమీపుత్ర శాతకర్ణికిని వాసిష్ఠి రాణికిని జనించిన వాడు . శ్రీపులమాయి సోదరుడుగ నున్నాడు. పులమాయి మరణానంతరం రాజ్యభారం వహించినట్లు గాన్పించుచున్నది. వీనిపేరిట నాణెములు కొన్ని ధరణికోట సమీపమున దొరికినవని రివరెండు థామస్సనువారు వర్ణించి యున్నారు. [1]ఇతడత్యల్ప కాలము మాత్రమే రాజ్యపాలన చేసెను. వాసిష్టీ పుత్ర చతుష్పర్ణ శాతకర్ణియె శివశ్రీ శాతకర్ణియై యుండు నేమోయని సందియము కలుగుచున్నది. భగవాన్ లాల్ పండితుడు మాధారి పుత్రశకనుడే శకసేనుడే శివశ్రీ కావచ్చునని తలంచిరి. భండార్కరు పండితుడు గూడా మొదట నట్లే తలంచిరి గాని యిటీవల నంగీకరించిన వారు కారు. థామసు గారికి ధరణి కోట సమీపమున దొరికిన నాణెములలో "శక సేనన" యని యుండక "శకశకాన" యనియుండుట చేత శివశ్రీశాతకర్ణి మాధారిపుత్ర శకసేనుడు కాజాలడని భాండార్కరు గారు వ్రాసిరి. ఇతడు శైవమతాధిక్యతను గలిగియుండిన బ్రాహ్మణమతమవలంబించినవాడుగ నుండినను బౌద్ధులను బ్రాహ్మణులను తండ్రివలెనే సమాన దృష్టితో జూచినవాడు. ఈ యాంధ్రరాజుల తల్లులు బ్రాహ్మణమత మవలంబించిన శకరాజుల యొక్కయు, పహ్లవరాజుల యొక్కయు పుత్రికలగుటచేత నాంధ్రరాజులు కూడా గడపటివారు బ్రాహ్మణ మతాభిమాను లగుచువచ్చినట్లు గన్పట్టుచున్నది.

శివస్కందుడు.

(క్రీ.త 165 మొదలుకొని క్రీ.త 172వరకు)

శివశ్రీ మరణానంతరము రాజ్యభారమును వహించినవాడు శివస్కందుడని మత్స్య విష్ణు భాగవత పురాణములు మూడును పేర్కొనుచున్నవి గాని వాయు పురాణము మాత్రము శివస్కందుని పేరు విడిచిపెట్టినది. శివస్కందుని పేరు

  1. The Indian Antiquary Vol.IX., p.64.