ఈ పుట ఆమోదించబడ్డది

రాయలు రుద్రదేవుని కంటె ముందుగానే మరణింప వలయును. ఇదియె యుక్తియుక్తమగు మార్గము.

రేచెర్లగోత్రీయులగు వెలమవీరులలో బలువురు కాకతీయులకడ సేనానాయకులుగ నుండి కాంచీనగరము భేదించి చోడరాజుల జయించితిమనియు గాంచీరాజ్యలక్ష్మిని గాకతీయుల కైవసము గావించితిమనియు వ్రాసికొనియున్నారు. ఆంధ్రదేశమునకు గాంచీరాజ్యము మిగుల దూరముగా నుండుటచే గాకతీయులు మాటిమాటికి గాంచీనగరములో బఱచికొనుటయు మఱల గొల్పోవుటయు బలుమాఱు జరిగియుండును. రుద్రదేవుని కాలమున గాంచీనగరమును రేచెర్ల నామిరెడ్డి జయించి చోడరాజు నవమానపఱచి తద్రాజ్యలక్ష్మిని రుద్రదేవుని యధీనము గావించినటుల శాసనదృష్టాంతములు గలవు. రుద్రదేవుడు తన యవసాన దశలో గణపతిదేవునకు రాజ్యము నొసంగెను. గణపతిదేవుడు మహాదేవరాయలకుమారుడు. రుద్రదేవునికాలము క్రీ.శ. 1140 మొదలుకొని 1196 వఱకై యుండునని చరిత్రగ్రంథమువలన దెలియుచున్నది. ఆంధ్రజాతీయతకు ఆంధ్రవికాసమునకు ఆంధ్రజాత్య భ్యుదయమునకు సహకారిగ నాంధ్రసామ్రాజ్యము స్థాపించిన వీరవతంసుడగు రుద్రదేవుని జీవితచరిత్రము పఠనీయము. ఈ మహనీయుని చరిత్రమెంతయో గ్రంథస్థము గావలసియున్నది చరిత్రకారు లీతని బ్రథమప్రతాపరుద్రుడని వ్యవహరించు