ఈ పుట ఆమోదించబడ్డది

నివేదించి 'వీరపత్ని! నా కడసారి యానపరిపాలింపు'మని వేడుకొనెను. సిరియాల దేవి భర్తృదైన్యవదనము ఖేద మోదములు తాండవింప సందర్శించి 'విధేయురాలనగు నన్ను గూర్చి వేఱ యడుగవలయునా! మీ యాజ్ఞ పరిపాలించుటకు జీవితమునంతయు వ్యయము చేయుదును. ఆనతిం'డని సవినయముగ వేడుకొనెను. కొంతసే పా పుణ్యదంపతులు నిశ్శబ్దముగ నూఱకుండిరి. వారి హృదయములు నిస్తరంగ నీరాకరమువలె శాంతి తరంగములతో నావరింపబడి భావనా ప్రపంచమున లీనమయ్యెను. ప్రత్యర్థు లొనరించు విజయభేరి భాంకారములు స్వీయు లొనరించు హాహాకారములు వారి కాసమయమున వినబడవయ్యెను. ఇంతలో ద్వారమునుండి యొక వీరు డుచ్చైస్వరమున "రాజన్యా! ప్రత్యర్థులు పురమున బ్రవేశించినారు. మన సైనికు లడ్డుపడుచున్నారు గాని కృతార్థులు కాజాలరు. అంత:పుర సంరక్షణ మావశ్యకమని మనవిచేయుటకై యరుదెంచితి" నని పల్కెను. అశనిపాతమునకు దీసిపోని యావాక్య మిరువురి సంకల్ప సౌధముల నధోగతము గావించెను. సోమరాజు సిరియాలదేవిని సాదరముగా సందర్శించి వీరపత్నీ! నీవు వీరమాతవు కావలయును. దైవానుగ్రహమున నీ గర్భమునందొక పవిత్ర తేజము ప్రవేశించియున్నది. భారతీయాభ్యుదయమున కది మిగుల దోడుపడగలదని ప్రజలేకాక యస్మదాదులు గూడ విశ్వసించి