ఈ పుట ఆమోదించబడ్డది

మాడభూషి వేంకటాచార్యకవి

1835 - 1895

వైష్ణవబ్రాహ్మణుడు. కౌశికగోత్రుడు. ఆపస్తంబసూత్రుడు. తల్లి: అలివేలమ్మ. తండ్రి: నరసింహాచార్యులు. జన్మదేశము: నూజివీడు. జననము: 1835. నిధనము: 1895-మన్మథనామ సంవత్సర ఫాల్గున బహుళ తృతీయ. గ్రంథములు: 1. భరతాభ్యుదయము (ప్రబంధము) 2. వామననాటకము. 3. పుష్పబాణవిలాసము, 4. హంససందేశము, 5. మదనమోహన చరిత్ర (వచనము) 6. బృహద్వైద్యరత్నాకరము. 7. రామావధూటీ నక్షత్రమాల (చాటుపద్యమణి మంజరి-ద్వితీయభాగము చూడుడు) 8. ఆనంద గజపతిపై వ్రాసిన 65 సీసములు.

శతావధానములను బ్రచారములోనికి దెచ్చినవారిలో వేంకటాచార్యులుగారు కనిష్ఠి కాధిష్ఠితులు. భట్టుమూర్త్యాదులు శతలేఖిని పద్యసంధానధురంధరుల మని చెప్పికొనినారు. వేంకటాచార్యుల వారు అసాధారణుడైన మేధావి. ఈయన గంటకు వందలకొలది పద్యములు చెప్పగలనేర్పరు లనుట తటుంచి, యేకసంధాగ్రహణమున నూరులకొలది పద్యములు అప్పగించు బుద్ధిమత్తరులు. వీరి మేధావిశేషమునకు బెక్కుకథలు తెలుగుదేశమున బ్రాకియున్నవి. వేటూరి ప్రభాకరశాస్త్రిగారు "చాటుపద్య మణిమంజరి" లో వెలువరించిన కథ యొకటి ప్రకటించెదను.

"పనప్పాకం అనంతాచార్యులుగారిదగ్గఱ కొకప్పుడు అవలిప్తుడగు అరవదేశపు విద్వాంసుడు వచ్చి స్వరచితము లైన శ్లోకములను జదువుచు వివరించుచు బ్రశంసించుకొనుచు నుండగా వేంకటాచార్యుల వారు వినుచుండిరి. పది శ్లోకము లయినవి. ఆత్మౌత్కృష్ట్య ప్రశంసాపరాయణుడుగా నున్న యా పండితునితో "అయ్యా ఈశ్లోకములు పిన్ననాడు మా నాయనగారు నాకు జెప్పిరి. ప్రాచీన కవికృతములైన