ఈ పుట ఆమోదించబడ్డది

నరసింహదేవర వేంకటశాస్త్రి

1828 - 1915

ఆరామద్రావిడశాఖీయ బ్రాహ్మణుడు. అపస్తంబసూత్రుడు. శ్రీవత్స గోత్రుడు. తల్లి సీతమాంబ. తండ్రి ఉమామహేశ్వరశాస్త్రి. జన్మస్థానము: తాడేపల్లిగూడెము. నివాసము: తణుకు తాలూకాలోని వెలగదుర్రు. జననము: 1828- సర్వజిన్నామ సంవత్సర కార్తీక శుద్ధ ద్వితీయ. విశాఖ నక్షత్ర చరుర్థ చరణము. నిర్యాణము: 1915 సం|| రాక్షసనామ సంవత్సర శ్రావణ బహుళ పంచమి. గ్రంథములు: 1. వేంకటేశ్వర శతకము. 2. గౌరీ శతకము. 3. విచిత్ర రామాయణము.

ఇరువదియేండ్లు వచ్చువరకును వేంకటశాస్త్రిగారు పండితుడు కాడు. కవియును గాడు. అష్టపదులు తరంగములు కృతులు మృత్యుంజయ విలాసము అధ్యాత్మరామాయణ కీర్తనలు చెప్పుకొని పాడుకొను నొక భక్తుడు. దానికి దో డాయన మృదంగము కూడ జక్కగ వాయించు చుండువారు. వెలగదుర్రు గ్రామమునకు సభాపతియై పెత్తనము నిర్వహించుచుండెను. అట్టిసమయమున నెవరో యొక శాస్త్రులుగా రాయూరు వచ్చి మన వేంకటశాస్త్రిగారితో సంస్కృతమున మాటాడ నారంభించిరట. వీరి కాభాష బొత్తిగా రాదు. దానితో నభిమానము పుట్టి నాడు మొదలు వేంకటశాస్త్రిగారు సంస్కృతాంధ్ర భాషలు పట్టుదలతో సాధించిరి. 28 వ యేట రచించిన వేంకటేశ్వర శతకము వీరి తొలికబ్బము. తరువాత ' గౌరీశతకము ' రచించిరి. ముప్పదవయేట " విచిత్రరామాయణము " రచించుట కారంభించి మూడేండ్లలో నారుకాండములును బూర్తిచేసిరి. ఇది శ్రీరామాంకితము. ఈ కవివరుని కీర్తిని శాశ్వత మొనరించునది యీ యొక్క కావ్యమే.

గోపీనాథకవి వచనమున నీ విచిత్రరామాయణము తొలుత రచించెను. అదిచూచి గద్యపద్యకావ్యముగా వేంకటశాస్త్రిగారిది వ్రాసిరి. ఇందు లాక్షణికు లంగీకరింపని ప్రయోగములు కొన్ని యున్నను కవి