ఈ పుట ఆమోదించబడ్డది

చేసినట్లే ప్రచురించెననియు జెప్పిరి. వీరు రచించిన యితరగ్రంథము లేనియు లేమింజేసియు, శైలి యన్ని భాగముల సదృశ మగుటంజేసియు నిందేది యెవరు రచించిరో తెలియుట దుస్సాధము...."

ఏది యెటైన నీగ్రంథ మొక్కటేతీరున ధారాళమైన కవిత్వముతో రాజిల్లినదనుట వాస్తవము. వేంకటేశ్వకవి పితామహుడు"......అజస్రాంభోరుహాస్తాను కం,పాసంప్రాప్త సమస్తదేశ విలసద్భాషా కవిత్వాది, విద్యాసంపాదితరత్న హేమ వసనక్ష్మారామ భూషాముఖ, శ్రీసత్కారుడు" అయిన వేంకటేశ్వరకవి యని గ్రంథములో జెప్పికొనెను. ఇతని తండ్రి "రాజాధిరాజ నభాంతరార్యలోక సంశ్లాఘ్య సకల కలా కలాపనిధి" యట. ఆయనపేరు కామకవిరాజు. తండ్రికడనే మన వేంకటేశ్వరకవి చదువులు సమస్తము చదివెనట. ఇతని పితృసోదరుడుకూడ నుభయభాషాకవిత్వ విశారదుడనియు, రాజానుగ్రహ పాత్రుడనియు గ్రంథాదినున్నది. మేనమామయు గొప్పభక్తుడు, నీతిశాస్త్రవేత్తగ జెప్పబడెను. ఈరీతిని దండ్రియు, బినతండ్రియు, బితామహుడు, మాతులుడు ప్రఖ్యాతు లైనటులును, మహారాజ సత్కారము లందినటులును వేంకటేశ్వరకవి కృతిప్రారంభపద్యములో ఘనముగస్తుతించుకొనెను గాని, వారి వారి గ్రంథములుగాని, వారినిగుఱించిన కథలుగాని కనబడవు, వినబడవును.

ఈ రామచంద్రోపాఖ్యానము నందలికవిత యందచందములు కలిగి ధారావిషయమున బూర్వకావ్యములతీరు స్మరింప జేయుచున్నది. ఎత్తుకపోయె, చేతును మున్నగు ప్రయోగములు కొన్ని వ్యాకరణము ననుసరించనివికలవు. మొత్తముమీద ద్రాక్షాపాకము, నడుమ నడుమ నారికేళ పాకముగ గవితసాగినది. మచ్చుపద్యములు:

చ. ఒక పలుగాకి కాకి యమితోన్మద మొప్ప ధరాకుమారికం

జికమక నొందజేయ రఘుశేఖరు డారసి దాని కాత్మలో