ఈ పుట ఆమోదించబడ్డది

కొని వ్యావహారికములో గొప్పతీరుగా వీ రీనాటకము వ్రాయుటకు దొరకొన్నారు. కాని పూర్తి కాలేదు.


విజయనగర రాజ్యమునకు సంబంధించిన ఠీవులు, నాటి విశేషములు నెన్నోకథలుగా, కావ్యములుగా వీరువ్రాయుటకు సంకల్పించికొని రని తెలియుచున్నది. పంతులుగారికి తెలుగునాటకరంగమును నూతన విధానములతో దీర్చి దిద్దవలయునని గాడాభిలాషయున్నటులు స్పష్టపడిన సంగతి. విజయనగరము మహారాజు ఆనందగజపతి నిరంతర సాహిత్యవ్యాసంగి. ఆయనకు అప్పారావుగారు హృదయము. ఆనందగజపతి యానందమునకు నాటకములు వ్రాయవలెనని అప్పారావుగారి తలపు.ఈతలపుతో నీయన నాటకరచన కుపక్రమించినను, క్రమముగా బుణ్యవశమున నది యాపదాంధ్రమునకు ఆనందకారణమైనది. గ్రీకు, రోమన్, ఇంగ్లీషు నాటకములు నిశితదృష్టితో బరిశీలించుచు, నెప్పుడును నవ్యతకుద్రోవలు చూచు నలవాటు అప్పారావుగారిలో నున్నటులు విన్నాను. ఆయనవ్రాసికొన్న "డైరీలు" చాలభాగము శ్రీ బుఱ్ఱా శేషగిరిరావుగారు ప్రకటించిరి. అది గొప్పమేలుసేత. ఈ దినచర్యలలో నెన్నోక్రొత్తవిషయములు గోచరించును. 1895 సం. ఏప్రిల్ 29 తేదీని వీరీ 'డైరీ' యిటులున్నది. " నాటకములలో నాయికలు తక్కువ - వసంతసేన బోగముపిల్ల - భూమిక ఆకర్షణీయమే. కాళిదాసుని నాయికలు శృంగారమునకే ప్రసిద్ధి - నాటకములలో దాంపత్య శృంగారమే - సంఘటనములు తక్కువ - నాయిక లేకుండా నాటకము - గ్రీకునాటకములలో గ్రీకుల సాంఘిక పరిస్థితులు - ఇంగ్లీషులో ఆంగ్లులవి - ఇండియను నాటకములలో హిందూపరిస్థితులు కనబడతవి."


నటకులను గూర్చి, అభినయమునుగూర్చి రంగస్థలమును గూర్చి వీరు వ్రాసికొన్న యక్షరములు శిలాక్షరములుగా నున్నవి. ఇవి అప్పారావుగారి 'డైరీ' ల యందలివని శేషగిరిరావుగారు చూపిరి.