ఈ పుట ఆమోదించబడ్డది

అఖిలలోకవిభుని నతిభక్తి సేవింప

నాత్మవిభుని కరుణ నభిలషింప

దగనివారు బడయ దగనివా రెవరమ్మ?

తరతరంబు లేల తడవెదమ్మ!


ఉ. వేంకట పార్వతీశ్వర కవిద్వయ నిర్మల వాజ్మన:క్రియా

సంకలసంబునం బొడమి సమ్మతమై ఫలపుష్ప శాఖికా

సంకుల సత్కవిప్రకర సాధునుతంబయి రామరాణ్మహేం

ద్రాంకితమైన యీకృతినురాగమ మర్థుల దన్పు గావుతన్!


మన తెనుగువారిలో నీ కవులను దాటిన కవు లున్నారు. పండితులున్నారు. భావకు లున్నారు. తెలుగుపలుకుబడి యింతమధురముగా, మృదువుగా, తేట తెల్లముగా, దీరుతియ్యముగా దీర్చి దిద్దినవారు తక్కువగ నున్నారు. పసిపిల్లవానినుండి, పండితునివఱకు నచ్చునట్లు తేలికభాసలో నింత సంతనగా సంతరించు కవిరాజహంసలు మనవారిలో నెందఱో లేరు. 'బాలగీతావళి' పలువురు చూచియుందురు. ఎంతసేపు, సాధారణజనబోధకముగా నుండునట్టి నడక వారి సొమ్ము. అట్టులని, యర్థగంభీరత యుండకుండునా? ప్రతిపద్యమున జాల గాంభీర్యము. ఈ జంటకవులు తమ 'లేఖిని' గూర్చి యీరీతి యుపదేశములు చేయుచుందురు.


వ్రాయుము నిర్మలభావ వి

ధేయమ్ముగ బుధజనాతిధేయముగ జగ

ద్గేయమ్ముగ లలితసుధా

ప్రాయమ్ముగ బాఠకశ్రవణసేయముగన్.


ఇట్టి కరపులు గఱచిన లేఖినితో నీనడుమ వేంకటపార్వతీశ్వర కవి కోకిల యుగళము తెనుగులో నాదికావ్యగానము చేయదొడగినది. రచన నేటి కయోధ్యకాండములోనికి వచ్చినది. అది సాంతమై గీటు ఱాతికి వచ్చుగాక!

                              _________