ఈకవి కోకటాగ్రహారమునకు శఠగోపపురమని పేరు పెట్టుటయేకాక తన మనుచరిత్రములోను హరికథాసారములోనుగూడ శఠగోపయతిని దనగురువునుగా స్తుతించి యున్నాడు-
క. కొలుతు న్మద్గురు విద్యా
నిలయం గరుణాకటాక్ష నిబిడజ్యోత్స్నా
దళితాశ్రితజనదురిత
చ్ఛలగాఢధ్వాంతసమితి శఠగోపయతిన్. [మనుచరిత్ర]
క. శఠగోపయతికి శఠతరు
కుఠారకోపమమతికిని గురుమతహృ త్క
ర్మఠనిరతికి జతురాగమ
పఠనాయతనియతికి నజపాసంభృతికిన్. [హరికథాసారము]
లక్షణగ్రంథములయం దక్కడక్కడ* నుదాహరింపబడిన పద్యములు లభించుటయేకాని హరికథాసారము పూర్ణముగా దొరికినదికాదు. హరికథాసారములోని యీరెండు పద్యములును రంగరాట్చందస్సునం దుదాహరింపబడి యున్నవి-
క. అంబరముపగుల నార్చి ప్ర
లంబాసురు డాగ్రహము వెలయ గదిరినవే
ళం బలరాముడు చేముస
లంబున వానితల ద్రుంచె లావు మెఱయగన్. [హరికథాసారము. ఆ 4]
క. తెంపరియై మది యింత చ
లింపక యనిలోనదెగియె నెవ్వ డతడు నై
లింప సభ నుండు ననుడు బ
దంపడి యాచార్యుతోడ దా ని ట్లనియెన్. [హరికథాసారము]