గీ. తమ్మమంత్రి గాంచె దిమ్మాయియందు నం
దనుల శౌర్యసింహు నారసింహు
జతురబుద్ధిచంద్రు సత్కళాగుణచంద్రు
గిరిచమూవరేంద్రు గీర్తిసాంద్రు.
తనతాతను రామభక్తునిగా జెప్పుటచేతను, అతనిభార్యను తిమ్మాయియని చెప్పుటచేతను కూడ నితడు మాధ్వవంశజు డేమోయని యూహింప దగియున్నను.
క. సారమతి యానృసింహుడు
వారాశిగభీరు డతులవై భవమున గౌ
రీరమణి నీశు డుంబలె
నారూడాన్వయ వరించె నక్కమసాధ్విన్.
అని తనతల్లిదండ్రులను పార్వతీపరమేశ్వరులతో బోల్చుట చేతను తనపూర్వుల కమాత్యాదిపదములను జేర్చుచు వచ్చుటచేతను కవి నియోగిబ్రాహ్మణుడని తోచుచున్నది. ఇత డాపస్తంబసూత్రుడు; భారద్వాజగోత్రుడు; నరసింహమంత్రిపుత్రుడు; సారంగు తమ్మయామాత్యపౌత్రుడు. ఈకవి వైజయంతివిలాస మనునాలుగాశ్వాసముల పద్యకావ్యమును రచించెను. ఇందు విప్రనారాయణుడనెడి యాళ్వారుచరిత్రము వర్ణింపబడినందున, దీనికి విప్రనారాయణ చరిత్రమనియు నామాంతరము గలదు. ఈవిప్రనారాయణునికే తొండరడిప్పొడియాళ్వా రని యఱవపేరు. ఈపుస్తకమునందలి కవిత్వము మనోహరముగానే యుండునుగాని యందందు కవిత్రయమువారి ప్రయోగములకు విరుద్ధములయిన ప్రయోగములు కానబడుచున్నవి. కథయు మిక్కిలి యింపుగా నుండును. విప్రనారాయణుడను వైష్ణవబ్రహ్మచారి కావేరితీరమునందు శ్రీరంగ క్షేత్రమునందు వసించుచు మాధుకర