మునిపరాశరగోత్రసంజనితు డార్య
సేవ్యతిరువేంగళాచార్యశిష్యు డనఘ
మంత్రి పెరుమాళ్ళకొమ్మయమనుమయోబ
మంత్రి తెలగయ భైరవమల్లమంత్రి.
అని యతడు జమాఖానునిచేత బ్రభువుగా జేయబడినట్లు చెప్పియున్నాడు. ఈ జమాఖాను పదునాఱవ శతాబ్దమధ్యమునం దుండినట్లు తెలియవచ్చుచున్నది. కవికాలమును నిర్ణయించుట కీగ్రంథములో నింకొకయాధారముకూడ గానవచ్చుచున్నది. ఇతడు పూర్వకవులను వర్ణించుచు,
సీ. ........ .......... ...........
............. ............ ...............
ఆ. "రావిపాటి తిప్పరాజాదిముఖ్యశృం
గారకవుల నెల్ల గారవించి"
అని రావిపాటి తిప్పరాజును బేర్కొనియున్నాడు. ఈరావిపాటి తిప్పరాజు-
మ. సరిబేసై రిపు డేల భాస్కరులు భాషానాథపుత్రా వసుం
ధరయం దొక్కడు మంత్రియయ్యె వినుకొండన్ రామయామాత్యభా
స్కరుడా యౌ నతడే సహస్రకరశాఖ ల్లే వవే యున్నవే
తిరమై దానము జేయుచో రిపుల హేతి న్వ్రేయుచో వ్రాయుచో.
పయిపద్యమును రామయామాత్యభాస్కరునిమీద జెప్పినట్లప్పకవీయములో నుదాహరింపబడియున్నది. ఈరామయభాస్కరు డచ్యుతదేవరాయని కాలములో నుండినట్లు కొండవీటిలోని గోపినాథస్వామివారి దేవాలయద్వారశాఖయందు వ్రాయబడియున్న యీక్రింది పద్యమువలన స్పష్టముగా దెలియవచ్చుచున్నది-