పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/185

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

కుసుమలతాదేవి చెప్పినట్లు పులమావి ధాన్యకటక నగరంలో ఒక రహస్యస్థలంలో దాగిఉన్నాడు. అతని వేషమూ మారిపోయింది. ముసిక నగరంనుంచి ఆయన సామంతులు, మంత్రులు, సేనాపతులు అపసర్పనాయికులు, చారులు అనేకులు వచ్చారు. స్వర్ణరాసులు కొనితెచ్చారు. ఆ రహస్యమందిరంలో పులమావి ఇరువురు చారులు, నాయకులతో మాట్లాడుచున్నాడు. వారిరువురు పులమావికి సాష్టాంగ నమస్కారంచేసి వెళ్ళిపోయారు.

ఆ రాత్రి పులమావి మారువేషంతో కొందరు అనుచరుల గూడి శ్రీకాకుళం వర్తకానికి పోయేవానిలా ప్రయాణం సాగించినాడు. ధాన్యకటక నగరం వెలుపల ఒక అర్ధగోరుతదూరంలో పులమావి జట్టును కొందరు రాజభటులు ఆపివేసినారు. “మీరు ఎవరు” అని రాజభటనాయకుడు వారిని ప్రశ్నించినాడు. పులమావి చారులలో ఒకడు వర్తకనాయక వేషంవేసి ఉండెను. పులమావిమాత్రం సేవకుని వేషంలో ఉన్నాడు. వణిక్కుల నాయకుడు “అయ్యా మా ఓడ ఒకటి యవద్వీపం వెడుతున్నది. దానిని సాగనంపడానికై నేను శ్రీకాకుళం వెడుతున్నాను” అన్నాడు.

“మీ ఓడ పేరు?”

“ఆనంద శ్రీ!”

“అలాగేకాని, మీరు ధాన్యకటకంలో ఎన్నాళ్ళనుండి ఉంటున్నారు? జన్మస్థల మెక్కడ?”

“మాది కాండూరునగరం. మేము ఇప్పటికి ఎనిమిది సంవత్సరాల నుంచీ ధాన్యకటకంలో వర్తకం చేసుకుంటున్నాము.”

“ఈ విషయాలన్నీ తెలుసుకునేవరకూ మీరు ధనకరాష్ట్ర ముఖ్యనగరం గురుదత్తపురంలో ఉండవలసివస్తుంది. ఇంక మీతో ఉండేవారి చరిత్రలు ఒక్కొక్కరివే తెలియ జేయండి.” ఇదివరకే చుట్టుప్రక్కల గ్రామాలలోను ధాన్యకటకనగరంలోనూ నివసిస్తూ వచ్చిన వారందరి చరిత్రలు ఆ వర్తక నాయకుడు మనవిచేసుకున్నాడు. పులమావి దగ్గరకు వచ్చి ఈతడు తనకుటుంబ సేవకుడైన ధర్మిలుని తనయుడైన నగధరుడనే పేరుకలవాడనిన్ని ఇంతప్పటినుంచీ తన యింటిలోనే పెరిగి తన పిల్ల లతోపాటు చదువుకొన్న బాలుడనిన్నీ తెలిపినాడు. ఇప్పుడీ బాలుని తండ్రి వృద్దుడవడంచేత తనకు సేవకుడయ్యాడనీ మనవి చేసినాడు.

ఆ దినాలలో నిజం తెలుసుకునే విధానాలు కొన్ని ఉన్నాయి. రాజభట దళాధిపతి తెలివైన అపసర్పనాయకుడు. ఎదుటున్న మాయవణిక్కునితో ఏవేవో ఈమాటా ఆమాటా మాట్లాడుతూతూ చటుక్కున "నగధరా!” అని పిలిచాడు. కాని పులమావి అదృష్టవంతుడు గనుక వెంటనే “చిత్తం!” అని ఆ రక్షకభట దళనాయకుని కడకు వచ్చాడు. పులమావి అదృష్టం పండింది. రక్షకభటుడు మీరు గురుదత్తపురం వెళ్ళవచ్చును అని వెళ్ళపోయాడు.

పులమావి గురుదత్తపురం వెళ్ళి అక్కడ అతిజాగ్రత్తగా ఉండవలసి వచ్చింది. సాహసం కలవాడినే లక్ష్మి వరిస్తుంది అని అతని మతం. ఉత్తమ కార్యాలకే ఆ సాహసాన్ని

అడివి బాపిరాజు రచనలు - 6

177

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)