పుట:Adhunikarajyanga025633mbp.pdf/282

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

త్రివర్గముపై ఆకార్య భారము మోపుట తగును. కనుకనే ఫ్రాన్సునం దెక్కువగాను, ఇంగ్లాండునం దిప్పుడిప్పుడును, తదితర దేశములందును ఆయాశాసనములందు జేర్చబడిన సూత్రముల ననుసరించి ఆశాసనముల ఆశయములు నెరవేరుటకై తగునట్టిరూల్సు రెగ్యులేషనుల ప్రకటించుటకు మంత్రివర్గమున కధికార మివ్వబడుచున్నది. కాని అట్టిప్రకటన అమలులోనికి వచ్చుటకు ముందు రెండు శాసనసభలముందద్దాని నియమితమగు కాలమువరకు నివేదించి యుంచవలసియున్నది. ఆవ్యవధిలోగానే రెండు శాసనసభలలో నేదైనను అవసరమగు అభ్యంతరముల నిరూపించి తగుమార్పుల జేయించనగును. ఈ ధర్మనిర్వహణమునకు సెనెటుసభవారు ప్రత్యేకముగా తగియుందురు. ఆసభవారికి తగినంతవ్యవధి, అనుభవము, వ్యవహార కుశలత యుండును. కనుక వారిట్టి "స్టాండింగు ఆర్డరు"లను పరీక్షించుచుండుట భావ్యము.

అనేక దేశములందు (అమెరికా, ఫ్రాన్సు, జర్మనీ, ఇంగ్లాండునందు ముఖ్యముగా) రాజవిద్రోహులగు రాచకీయ నాయకులను, ప్రజాప్రతినిధిసభవారు నిందితుల జేయుటయు వారిని విచారించుటకు సెనెటుసభ వారు న్యాయమూర్తులై న్యాయా న్యాయముల తేల్చుటయు ఆచారమై యున్నది. ఇంగ్లాండునందిట్టి 'రాజవిద్రోహవిచారణల'ను ప్రభువులసభ వారు చేయుచుండుట చాలకాలమునుండి లేదు కాని ఫ్రాన్సునం