యాబి చేచాయనె చూపి "అల్లదె మాగృహము. మే మట నివసింతు" మనియెను.
"ఓ! కాపురముండుట కది రమ్యముగ నున్నది. మీ తండ్రిగా రట నుందురు ?"
"అదె యతడె. మిము జూడ గుతూహలుడై యున్నాడు."
"నాకును నతని జూడ గొప్ప వాంఛ గలదు."
ఈలోపుగ వారు థామసుంజేరిరి. అతడు పార్సన్ రాక కుప్పొంగి మన:ప్రీతిగ స్వాగత మిచ్చెను. వారిద్దఱకును గొంత సంభాషణ జరిగినపిదప నెల్కిన్సు పార్సన్ గా రుపన్యాసము నా మరుసటి భానువాసరమున నాంసీ సమాధికడ నిచ్చునట్లు నిర్ధారణచేసికొనిరి. పదిపదునైదుమైళ్లలోగల 'మార్గదర్సక' గృహములకెల్ల నీవార్త పంప బడియెను. ఈ పవిత్ర కార్యమునకు వలయు సన్నాహము లన్నియు నాయత్తపఱుపబడెను.
మధ్యకాలమున నా పురోహితు డిరుగుపొరుగులనుండు జనులనెల్లర దర్శించి దైవికవిషయముల వారికి బోధించుచుండెను. ఆబియొక్క బాలప్రౌఢిమకు మెచ్చి యతనికిగూడ గొంత యుపదేశ మొనర్చెను.
ఆదిత్యవారము సమీపించెను. నాంసీ చనిపోయి యాఱు మాసము లై యుండినను నాపె జ్ఞాపకార్థ ముపన్యాసమనిన