కృష్ణాకుమారి
ఈవీరబాల మేవాడ దేశాధిపతి యగు మహారాణా భీమసింహుని కూఁతురు. ఈమె 1792 సంవత్సరమున మేవాడదేశపు రాజధాని యగు ఉదేపూరున జన్మించెను. జాతకర్మాది సంస్కారములు జరిగినపిదప నాబాలకుఁ గృష్ణయని నామకరణము చేసిరి. కృష్ణయం దామెజనని కధికప్రీతి యగుటచే నామె మిక్కిలి గారాబముతోఁ బెరుగుచుండెను. కృష్ణాకుమారి అత్యంత రూపవతిగా నుండెను. ఆమె పెరిగిన కొలఁదిని నామె యందలి యనేక సద్గుణములచే నామె విశేషకీర్తిం గనెను. ఇట్లుండఁగా గొన్ని సంవత్సరముల కాబాల వివాహయోగ్య యయ్యెను. కాన రాణిగారికి గూఁతు వివాహచింత విశేషమయ్యెను. ఆమెయొక్క యసమానరూపమును మృదుమధుర భాషణములును నదివఱకే దేశమంతటను వ్యాపించెను. కాన జనులామెను రాజస్థాన మను కొలనిలో నీమెయపూర్వపద్మమని పొగడుచుండిరి.
ఇట్టి కన్యారత్నము నేవరునకు నియ్యవలయునని భీమరాణా మిగుల విచారసాగరమున మునింగెను. ఆయన కిట్టి చింత గలుగుట కొకకారణము కలదు. ఆ కాలమునందా రజపుతస్థానమునం గల రాజు లందఱిలో ఉదేపురపు రాణాలు శ్రేష్ఠకులీనులుగా నెన్నఁబడుచుండిరి. తమకంటె నుచ్చవంశీకులకుఁ గన్య నిచ్చిన సరి. లేనియెడల రజపూతులలో మిగుల