పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/22

ఈ పుట ఆమోదించబడ్డది

8

అబలాసచ్చరిత్ర రత్నమాల.

స్వాతంత్ర్యసుఖమును చెఱుపఁ బ్రయత్నించినయెడల పిదప విశేషదు:ఖము కలుగును." అని విన్నవించుకొనెను. ఇంతలో జయచంద్రుఁడు రోషారుణలోచనుఁడయి "నోరుమూసుకొని వెళ్ళు, నావద్ద నీవంటి దుష్టస్త్రీలు మాటలాడఁదగరు." అని ధిక్కరించెను. "అటులైన నాప్రార్థన యంతయు వృధవోయనా?" యని యాకాంతాలలామ రౌద్రరూపము వహించి తండ్రి వంక జూచి యిట్లనియె. "పూర్వులార్జించిన సత్కీర్తిని నాశముచేసి మీదుష్కీర్తిని శాశ్వతపఱుచుటకుఁ బూర్వమే నీకుమార్తెనయిన న న్నీ యపకీర్తి వినకుండ నేల చంపవైతివి? నీవు నాతండ్రివిగాన నేనింతగాఁ జెప్పవచ్చితిని కాని నీ యభిప్రాయ మెఱిఁగిన పిదప స్వదేశద్రోహికూతుఁ రనిపించుకొని బ్రతుకుట కంటెఁ జావు మేలని తోఁచుచున్నది."

ఆడుసింగమువలె నెదిరించి మాటాడుకూఁతున కేమియుఁ జెప్పఁ జాలక జయచంద్రుఁడు మెల్లఁగా నావలకరిగి యశ్వము నెక్కి యాతురక సైన్యములోని కేఁగెను. ఇచట సంయుక్త తండ్రి లోపలకువచ్చునని కొంతసే పెదురుచూచి యాతఁడు వచ్చుజాడగానక నిరాశతో మరలి తనపతిచెంత కేఁగెను. ఈతడవ తమవైపున నల్పసైన్యమును పగఱవైపున నమిత సైన్యమును గలదుగాన తన కపజయమే యగునని పృధివీరాజెఱిఁగి యా సంగతి సంయుక్తకుఁ దెలిపెను. ఆదంపతు లిరువురును ఇసుమంతయు ధైర్యము విడువక నొకరికొకరు తగునీతుల నుపదేశించుచు నుత్సాహయుతులై యుండిరి. వారిరువురి యాలోచనప్రకారము యుక్తమనితోఁచఁగా నామెఢిల్లీకి ప్రయాణమయ్యెను. గమనసమయమునం దామె భర్తకు నమస్కరించి