మహారాణీఝాశీ లక్ష్మీబాయి
129
బోవుమార్గమును విచారించి వేరువేరుమార్గముల సైన్యములు నడువవలిసిన క్రమమును దెలిపెను. క్రమక్రమముగా సర్ హ్యూరోజ్ దొరగారు తమసంగ్రామ కౌశలమందఱునుం గొనియాడ బందిపోటుసైన్యముల పాలయిన భూము లనేకములు గెలిచి, ఝాఁశీని గెలుచుతలంపున నచటికి 14 మైళ్ళ సమీపమున తనసైన్యములను విడియించిరి. వారచటనుండి ఝాఁశీ వర్తమానముల నరయుచు, 1858 వ మార్చి 20 వ తేదిని ఝాఁశీ పొలిమేరల బ్రవేశించి పురరచన నరసి తదను సారముగా సైన్యములను యుద్ధమున కాయత్తము చేసిరి.
అప్పుడు శౌర్యరాశియగు రాణిగా రాగ్రహించి యిఁక నింగ్లీషువారితో పొసగదని తెలిసికొని యుద్ధసన్నాహము చేయసాగెను. నధేఖాతోడ రణ మొనర్చునపుడుంచిన విశేష సైన్యమున కనేకస్థలములనుండి పరతెంచివచ్చిన బందిపోటు సైన్యములు తోడుపడెను. రాణిగారి సైనికులలో శూరులగు ఠాకురులోకులును, విశ్వాసార్హులగు పఠాణులును విశేష ముండిరి. ఆసేనాధిపత్యమునంతను రాణిగారు తామే స్వీకరించి తగినబందోబస్తు చేయసాగిరి. ఝాఁశీకోట మిగుల విశాలమైనదియు, నభేద్య మగునదియునై యుండెను. అచట గొప్ప గొప్పబురుజు లుండెను. ఆకిల్లాలో విశేషదినములనుండి నిరుపయోగములై యున్న యనేకఫిరంగులను రాణిగారు బాగుపఱచి బురుజులపై కెక్కించిరి. ఒక్కొక్కఫిరంగి కొక్కొక్క యుద్ధకలానిపుణుని నియమించిరి. ఇట్లామె తననేర్పుమెయి సేనలను నడుపుచు యుద్ధసన్నద్ధురా లాయెను.