జగదేవునికి నధికార ప్రాప్తియైనప్పటినుండియు, దుష్టులకు బహుబాధ గలుగుచుండెను. కనుక, వారందరును జగదేవుని జంపుట కైయనేకోపాయములబన్నిరి గాని, యవియన్నియు నిష్ఫలములయ్యెను. కాని యొక సంవత్సర మాపట్టణమున గత్తరలు పుట్తిలోకులనేకముగా జచ్చుచుండిరి. ఎన్ని యుపాయములు చేసినను గత్తర ఆగకపోయెను. అప్పుడు రాజు సర్వప్రజాసంహారమగునేమో యని భీతిల్లి, తన్నివారణమునకై యూరిబైటనున్న కాళికాదేవినిబూజించుటకు రోజును స్వయముగా వెళ్లుచుండెను. ఇట్టి సంకటసమయమున నెవరేమిచెప్పినను, ఎట్టి యసంభవములైన దైవిక చమత్కారములను జూపినను, రాజుగారు నమ్మగలరని తలచి దుష్టులొక యుక్తిని గల్పించిరి. వారిలో నొకడు కాళికాదేవి విగ్రహమునకు వెనుక నిలుపబడి, రాజుగా రేకాంతముగా బూజచేయునప్పుడు, దేవి పలికినటులే యిట్లనియె. "ఓ మహారాజా! నీభక్తికి మెచ్చితిని; ఈ రోగముపోవుట కొక యుపాయము చెప్పెదను వినిము. సర్వసద్గుణ సంపన్నుడైన యొక రాజకుమారుని నాకు బలియిచ్చిన పక్షమున, ఈరోగము పోయి ప్రజలు సుఖింతురు; నీవును నూరేండ్లు రాజ్యము చేసి ఆనంద మొందెదవు." అందుకు రాజు "ఓ తల్లీ! నారాజ్యములో సకల సుగుణములుగల రాజపుత్రుడెవ్వడుగలడో నీవే యానతి యిమ్ము" అనెను. అప్పుడు కాళికాదేవి యిట్లనియె. "వత్సా! నీరాజ్యములో నిట్టి రాజకుమారుడు లేడని చింత పడకుము. నీ దండనాయకు డగు జగదేవు డిన్నిగుణములు గలవాడు. కనుక నతనిని బలి యిచ్చిన పక్షమున నీవును, నీ ప్రజలును సుఖించె
పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/53
ఈ పుట ఆమోదించబడ్డది