పుత్రులగు నానాసాహేబు, రావుసాహేబు లాకాలమునందు బాలురేగాన వారితో నీ చిన్నది సదా కలసిమెలసి యుండుచు వచ్చెను. నానాసాహేబేమి నేర్చిన నది మనూబాయి నేర్చుకొనుచు, వారిద్దరన్న చెల్లెలి వరుసలతో బిలుచుకొనుచుండిరి. చదువు, అశ్వారోహణము, ఖడ్గము త్రిప్పుట మొదలయిన వన్నియు మనూబాయి నానాసాహేబుగారితోడనే నేర్చు కొనును! ఈమె స్వభావము బాల్యమునుండియే శౌర్యగుణ ప్రధానముగా నుండెను. దీని కంతకు క్షత్రియాగ్రగణ్యగుణములు గల శూరుల సంసర్గమే కారణము. ఇందువలన స్త్రీలు స్వభావము చేతనే పిరికివారనియు, వారికి శౌర్యధైర్యము లెన్నివిధములను పట్టువడనేరవనియు వాదిందు విద్వాంసులకు సంశయనివృత్తి కాగలదు. స్త్రీలకును పురుషులవలెనే బాల్యమునుండి యెట్టి సంస్కరణ జరుగునో యట్టి గుణములే యబ్బునని సిద్ధమగును.
ఇట్లుండ నొకానా డాకస్మికముగా ఝాశీ సంస్థానమునందలి జ్యోతిష్కుడగు తాత్యాదీక్షితులు బాజీరావును సందర్శింపవచ్చెను. ఆదీక్షితులతో సందర్భానుసారముగా మోరోపంతుగారు ఝాశీవైపున మాచిన్నదానికి వరుడు కుదురునాయని విచారించెను. అందుకాయన "ఝాశీ సంస్థానాధీశ్వరుడగు గంగాధరరావు బాబాసాహేబుగారికి బ్రథమపత్ని యగు రమాబాయి కాలధర్మమునొందెను కాన నీకొమార్తెకా సంబంధము విచారింపు"మని చెప్పెను. తదనంతర మీ వివాహమును గురించి బాజీరావు గంగాధరరావుకు