శమునందు గల నక్షత్రములను లెక్కించుటకు వీలు లేనందున మిక్కిలి చింతనొంది యా సంగతి కొమారునకు దెలిపెను. కొమారుడును దన శక్తి యంత వినియోగపరచి చూచెనుగాని, యా యుక్తులేవియు నక్షత్రసంఖ్య దెల్పుట కెంత మాత్రమును పనిపడినవి కావు! ఇట్లు పితాపుత్రు లిరువురును నిరుపాయులై రాజసభలో దమకు నవమానము గలుగునని చింతాక్రాంతులై యుండ, వారిని జూచి ఖనా విచారహేతు వడిగెను. ఆమె యందుకు గారణము తెలిసికొని దీని కింత విచారమేల యని వారికి గొంత ధైర్యము జెప్పి తానొక గడియసేపు గణితము చేసి నక్షత్రసంఖ్య గనిపెట్టి వారికి జూపెను. అందుపై వారు ప్రముదితులై భోజనములు చేసి, రాజసభకుబోయి యానక్షత్రసంఖ్యను దాని గనుగొనిన రీతియు జూపగా సభికు లందరును అధికాశ్చర్యమగ్న మానసులైరి, అంత వరాహు డా మహాకార్యము తనప్రజ్ఞవలనదెలియలేదనియు, తనకోడలే విద్యాధికురాలైనందున నీ సంఖ్య సులభముగా గనిపెట్టెననియు జెప్పెను. ఆ మాటవిని యచట నున్న వారందరును ఆ విదుషిని వేనోళ్ళ గొనియాడిరి. విక్రమాదిత్యుడు మిగుల సంతసించి "నా సభ యందు నవరత్నములలో రేపటినుండి ఆమె దశమరత్నముగా నుండును. కాన రేపటినుండి యామెను అవశ్యముగా సభకు దోడ్కొని రమ్మని యానతిచ్చెను! రాజాజ్ఞ వినినతోడనే వరాహున కత్యంత భీతికలిగెను. ఎందుకన, స్త్రీలను రాజసభలలోనికి దీసికొనిపోవుట యెంతయు నవమానకరమనియు, లోకనిందాస్పదమనియు వరాహుని యభిప్రాయమట! కోడలిని రాజసభకు
పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/107
ఈ పుట ఆమోదించబడ్డది