ఈ పుట ఆమోదించబడ్డది

రాయ్‌ను శాస్త్రి ఆదరించి జాగ్రత్తగా చూచారు. అక్కడే తొలుత అబ్బూరి రామకృష్ణారావు కూడా రాయ్‌ను కలుసుకొన్నారు. బొంబాయి నుండి ఎలెన్ వచ్చి చేరింది. అబ్బూరి ఆహ్వానంపై రాయ్ వాల్తేరు వెళ్ళి సముద్రతీరాన దాదాపు నెలన్నర విశ్రాంతిగా ఉన్నారు. అప్పుడే రాయ్ మేధాశక్తిని చర్చలలో గమనించిన అబ్బూరి జీవిత పర్యంతం రాయిస్టుగా మారిపోయారు. రాయ్ స్థాపించిన రాడికల్ డెమొక్రటిక్ పార్టీలోనూ, అది రద్దుచేసిన తరువాత ఉద్యమంలోనూ అబ్బూరి పనిచేశారు. అప్పటి ఉత్తరాలలో కొన్ని లభించగా డిల్లీలోని నెహ్రూ మ్యూజియంలో భద్రపరిచారు. అవే యిప్పుడు చిన్ని పుస్తకంగా రూపం దాల్చాయి.

1937 నుండీ అబ్బూరికి వ్రాసిన ఉత్తరాలలో రాయ్ కొన్నిపేర్లు ప్రస్తావించాడు. అలాంటి వారు అటు పార్టీలోగానీ, ఇటు ఉద్యమంలోగానీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పనిచేసి ఉండొచ్చు. వివరాలు చరిత్రకారులు పరిశీలించవలసి ఉంది. అలా ప్రస్తాననకు వచ్చిన పేర్లు: దేవకినంద(విజయనగరం), గుప్త(వాల్తేరు), రామకృష్ణ పరమహంస, కె.కృష్ణారావు(ఏలూరు), ఎం.వి.శాస్త్రి, జగన్నాధం, సుబ్రహ్మణ్యం, నారాయణమూర్తి (ప.గోదావరి), ఫణిరాజు, శర్మ (రాజమండ్రి), నరసింహారావు (విజయనగరం), సుప్రసిద్ధ ఆర్టిస్టు ఎన్.ఎన్.చేమకూరి ఒక సందర్భంలో రాయ్ పుస్తకానికి ఆర్ట్ ముఖచిత్రం గీసినట్లు ప్రస్తావన ఉంది.

కొత్త సచ్చిదానందమూర్తి తన ఇండియన్ ఫిలాసఫీ పుస్తకానికి రాయ్‌ను పీఠిక వ్రాయమని కోరిన విషయం చెబుతూ, ఆయన్ను గురించి వాకబు చేసిన మాటలు ఒక లేఖలో ఉన్నాయి.తరువాత ఆ పుస్తకానికి రాయ్ సుదీర్ఘ పీఠిక వ్రాశారు. సచ్చిదానందమూర్తి ఉత్తరోత్తరా తన భావాన్ని మార్చుకొని అ పుస్తకాన్ని కాదన్నారు. కీ.శే.నార్లవంటివారు అందుకు బాధపడ్డారు. ఎం.ఎన్.రాయ్ చనిపోయినప్పుడు అబ్బూరి ఒక కవితలో తన సంతాపాన్నివ్రాశారు. రాయప్రోలు శ్రీనివాస్ దీన్ని ఇంగ్లీషులో అనువదించారు. 1980 జనవరి రాడికల్ హ్యూమనిస్టులో ముద్రితమైంది. రాయ్ సమాధి శ్రద్దాంజలిలో భాగంగా ఈ గేయాన్ని ఆనాడు పెట్టారు.

రాడికల్ హ్యూమనిస్ట్ పత్రిక ఎడిటర్ ఆర్.ఎం.పాల్, మానవవాద ఉద్యమనాయకులు వి.ఎం. తార్కుండే వ్రాసిన వ్యాసాలు చాలా పుస్తకంలో చేర్చారు.

అబ్బూరి ఛాయాదేవి ఈ చిన్నపుస్తకాన్ని ప్రచురించి మంచిపని చేశారు. ఆర్.ఎం.పాల్ కుటుంబానికి ఆమె సన్నిహితురాలు. పాల్ కుమార్తె సంగీతామాల్ నేడు రాడికల్ హ్యూమనిష్ట్ పత్రిక సంపాదకత్వాన్ని బొంబాయి నుండి చూస్తున్నారు. పుస్తకంలో ఎలెన్ ఉత్తరం కూడా ఒకటి చేర్చారు.

అబ్బూరి అండ్ ఎం.ఎన్.రాయ్

ప్రచురణ:అబ్బూరి ట్రస్ట్,

బాగ్‌లింగంపల్లి,హైదరాబాద్-500 044.

వెల:రూ.40/-

-హేతువాది, అక్టోబరు 2000