ఈ పుట ఆమోదించబడ్డది

వలన వారి వెనుకబాటుతనం వారిని వెన్నంటుతూ వస్తున్నది. వైజ్ఞానిక విద్య వారికి విమోచన కల్పిస్తుంది.

దళితుల్ని చీల్చి,ఆయా రాజకీయ పార్టీలకు తాకట్టు పెట్టిస్తున్న దళితనాయకులే దళితులకు ద్రోహం చేస్తున్నారు. ఇది అన్ని పార్టీలకు చెందిన ఓట్ల, సీట్ల వ్యవహారం. దళిత నాయకత్వం చేస్తున్న యీ దళారీ వ్యవహారాలే ఇన్నాళ్ళుగా దళితుల్ని వెనకబాటుతనంలో అట్టిపెట్టాయి. తాత్కాలిక లోభాలకు కక్కుర్తి పడుతున్న నాయకులు, సుఖాలు అనుభవిస్తూ యీ పనులకు దిగారు. అధికారం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికారంలో లేనివారు, ఎన్నికలకై ఎదురుచూస్తున్నారు.

దళితుల మరో ప్రధాన సమస్య జనాభా నియంత్రణ, ఇందుకుగాను వారికి మూఢనమ్మకాలు పోగొట్టి,కుటుంబ ఆర్థిక వ్యవస్థ వివరించి, దేశసమస్యకూ దీనికి గల సంబంధం చెప్పి, ఒప్పించవలసి వుంది. ఇదేమంతా సులభమైన విషయం కాకున్నా అవసరం. ఇక్కడకూడా మతనమ్మకం వారికి అడ్డుపడుతున్నది. కనుకనే సమస్య జటిలమైంది. దేవుడిచ్చిన సంతానం అనే భ్రమ తొలగించడానికి వైజ్ఞానిక విద్య చెప్పి ఒప్పించవలసి వుంది.

దళితుల సమస్య ఆర్థిక సమస్య కాదు. కేవలం ఆర్థిక బాధ తీరితే, అంటరానితనం పోయి సమానత్వం రాదనేది తేలిపోయింది. డబ్బున్న దళితులు సైతం అంటరానితనం సమస్యకు గ్రామాల్లో గురౌతూనే వున్నారు, మనిషిని ఆర్థికంతో కొలిచే తప్పుడు సిద్ధాంతం వలననే. దళితుల సమస్యలు దీర్ఘకాలికాలు,తాత్కాలికాలు అని రెండుగా చూడాలి. తాత్కాలికమైన వాటిని రాజకీయ పార్టీలు, మతపక్షాలు పట్టించుకొని,తీర్చడానికి ప్రయత్నిస్తూ, ఆకర్షిస్తునాయి. సౌకర్యాలు, ఉద్యోగాలు, కేటాయింపులు యీ కోవలోకి వస్తాయి.

దీర్ఘకాలికమైన అంటరానితనాన్ని పోగొట్టడం, మానవహక్కులు అమలుజరపడం, ఉచిత నిర్భంద వైజ్ఞానిక విద్యను ఆచరణలోకి తీసుకురావడం కోసం దళిత నాయకత్వానికి స్పష్టమైన అవగహన అవసరం. దళితుల అంధవిశ్వాసాలు, మూఢాచారాలు పోగొట్టకపోగా, వాటిని సమర్ధించే నాయకత్వం వారికి ద్రోహులుగా పరిణమించింది. ముఖ్యంగా రాజకీయపార్టీలలో చేరి అధికార పదవులకోసం దళితుల్ని ఫణంగా పెట్టినవారు చేస్తున్న సాంఘికనేరం ఇంతా అంతా కాదు.

అగ్రకులాలలో వున్న జాడ్యాలు, రుగ్మతలు,దోషాలు, రాజకీయ దళారీతనం గర్హనీయాలు. వాటిని దళితులు ఆదర్శంగా తీసుకోవాల్సిందేమీ లేదు. రాజకీయ పార్టీలకు తమ కులాల్ని ఓట్ల ద్వారా తాకట్టు పెట్టించే దళారీ వ్యాపారాన్ని అగ్రకులాలే మొదలెట్టాయి. అది అంటురోగం వలె దళితుల్నీ ఆవహించింది. దాన్నుండి దళితులు బయటపడాలి.

తీవ్రమైన సమస్యకు పరిష్కారాలు కూడా తీవ్రంగానే పరిగణించి,అమలుపరచాలి.

- హేతువాది, సెప్టెంబర్ 2002